రాష్ట్ర విభజన తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ గురించి పలువురు పలు రకాలుగా మాట్లాడుతున్నారు.అయితే రాష్ట్ర విభజన పూర్తి అయ్యి ఏడు నెలలు పూర్తి అయినా కూడా ఇప్పటి వరకు తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్లోనే కొనసాగుతూ వస్తోంది.
ఇకపై కూడా హైదరాబాద్లోనే ఉంటుందని, అందుకోసం తెలంగాణ ముఖ్యమంత్రి భారీ ఎత్తున ఒక సినిమా సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది.అయితే తాజాగా తెలుగు ప్రముఖ కమెడియన్ అలీ ఈ విషయంపై సంచలన ప్రకటన చేయడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణం పూర్తి అయిన తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ గుంటూరుకు తరలి వెళ్లడం ఖాయం అంటూ అలీ చెప్పుకొచ్చాడు.గుంటూరులో మౌళిక వసతులు చాలా బాగున్నాయని, షూటింగ్స్కు అనువైన వాతావరణం గుంటూరులో ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చాడు.
అయితే గుంటూరుకు సినీ పరిశ్రమ మొత్తం వెళ్లిపోకున్నా కూడా సినీ ప్రముఖులు ఇక్కడ స్టూడియోలు నిర్మించే అవకాశాలున్నాయని అలీ చెప్పుకొచ్చాడు.తాజాగా ఈయన గుంటూరులో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని పై విధంగా మాట్లాడాడు.
అలీ వ్యాఖ్యలపై తెలుగు సినీ వర్గాల వారు పెద్దగా స్పందించేందుకు ఆసక్తి చూపడం లేదు.అది ఆయన వ్యక్తిగత విషయం అని, ఇండస్ట్రీ మాట కాదని కొందరు అంటున్నారు.