ఏ సుముహూర్తాన చంద్రబాబు రైతుల రుణమాఫీ నెత్తికెత్తుకున్నారో అక్కణ్ణించి రైతులకు పడరాని పాట్లు అన్ని వైపులనుంచి ఎదురయ్యాయి .ఈరోజు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఆంధ్రాబ్యాంకులో తమ బంగారం వేలం వేశారని ఇందుకు గల కారణం మాకు తెలియాలి అని పెద్దఎత్తున రైతులు బ్యాంకును చుట్టుముట్టారు.
మంగళవారం మధ్యాహ్నం వేగేశ్వరపురం ఆంధ్రాబ్యాంకు ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు.రైతు నాయకులు బుద్దాల గాంధీ, బి పుల్లారావు, తైలం సత్యనారాయణ, శంకాబత్తుల తులసీరత్నం తదితరులు మాట్లాడుతూ వడ్డీ చెల్లించినప్పటికీ తమ అప్పులు తిరగరాయకుండా, నోటీసు ఇవ్వకుండా బంగారం వేలం వేశారని, మిగిలిన పైకాన్ని చెక్కు రూపంలో పంపించారని ఆవేదనతో తెలియచేసారు .రెగ్యులర్ గా బ్యాంకు ఇచ్చిన అప్పులకు వడ్డీలు కట్టాము అలాగే,ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రుణాలు మాఫీ చేస్తారని ఎదురు చూశామని, అప్పులు పోలేదని తెలిసి వడ్డీ చెల్లించి బాంకు వారికి తిరగరాయమంటే మా తాకట్టు బంగారం వేలం వేశారని చాలా దుర్మార్గమని ఆవేశ పడ్డారు దీనిపై బ్యాంకు మేనేజర్ డి చెంచయ్య మాట్లాడుతూ బ్యాంకు 2011-13 సంవత్సరాల్లో బాకీలను పరిగణనలోకి తీసుకుని నిబంధనల ప్రకారం నోటీసులిచ్చి రైతులు మా నోటీసులకు ఖాతరు చేయనందుకే వేలం వేశామని తెలిపారు.