విమర్శలు ప్రతి విమర్శలు అన్నవి రాజకీయంలో వెరీ కామన్.కానీ వ్యంగ్యమైనా విమర్శైనా వ్యాఖ్య అయినా కొంత వరకే.
ఏదీ శ్రుతి మించరాదు.కానీ సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు రాజకీయం కొత్త రంగులు పులుముకుంటోంది.
ఓ వ్యక్తి అరెస్టు కారణంగా రాజకీయం ఇంకా ఇంకా వేడెక్కుతోంది.దీంతో మాటల యుద్ధం షురూ అయ్యింది.
తాజాగా వైసీపీనేతలకు, టీడీపీ నేతలకు నువ్వానేనా అన్నట్లుగా వాగ్వాదం నడుస్తోంది.చినబాబుని ఉద్దేశిస్తూ ఓ ఫేస్ బుక్ పేజ్ నిర్వాహకుడు పెట్టిన పోస్టు కారణంగా వైసీపీ కీలక నేత ఆడిటర్ సాయిరెడ్డి సైతం రంగంలోకి దిగి అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధం అంటున్నారు.
మరోవైపు సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వివాదం మరింత వేడెక్కుతోంది.మొత్తంగా పొలిటికల్ పంచ్ పేజ్ని యథాతథంగా నిర్వహిస్తామని రవికిరణ్ చెబుతుంటే, ఎవరైనా దిగజారి వ్యాఖ్యలు చేస్తే అరెస్టులు తప్పని టీడీపీ నేత, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పష్టం చేస్తున్నారు.
టీడీపీ నేతల మాటలు విని వైకాపా మరో అడుగు ముందుకువేసి సోషల్ మీడియానే అస్త్రంగా చేసుకుని సీఎంపై వార్ ప్రకటిస్తానమంటోంది.ఏదేమైనప్పటికీ రవికిరణ్ వ్యాఖ్యలను తాము సమర్థించడం లేదని, కానీ అర్ధరాత్రి ఆయనను అరెస్టు చేసిన తీరునే తాము తప్పు పడుతున్నామని లోక్ సత్తా నేతలు సోషల్ మీడియాలో పోస్టులు ఉంచారు.
ఆప్ సైతం టీడీపీ తీరును ఖండిస్తోంది.మొత్తంగా ఈ వివాదం శాసన సభ వ్యవహారాల దాకా వెళ్లింది.సంబంధిత అధికారులు కూడా రంగంలోకి దిగి బాధ్యులకు నోటీసులు ఇచ్చారు.వైసీపీ సోషల్ మీడియా ఇంఛార్జ్ మధుసూదన్ రెడ్డికి అసెంబ్లీ కార్యాలయ వర్గాలు నోటీసులు జారీ చేయడంతో వివాదం ఇంకా రాజుకుంది.
వైసీపీ అధినేత జగన్ సైతం ఈ విషయమై అంతా ఏకమై టీడీపీ తీరుని వ్యతిరేకించాలని నిన్న రాత్రి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.ఏదేమైనప్పటికీ సోషల్ మీడియపై నియంత్రణకు సంబంధించి అటు న్యాయ నిపుణులలోనూ ఇటు రాజకీయ వర్గాలలోనూ నెటిజనులలోనూ తీవ్ర చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉంటే కొన్నిరాజకీయ పార్టీలు అప్రమత్తమై ఇదివరకు తమ ఎఫ్బీ పేజీలలో ఇతరులను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై ఉన్న పోస్టులను డిలీట్ చేస్తుండడం గమనార్హం.ఏదేమైనప్పటికీ మీడియా, సోషల్ మీడియా వీటిపై నియంత్రణ ఎంతవరకూ ఉండాలి అన్న అంశం పై చర్చ ఇప్పటిది కానప్పటికీ అన్ని వర్గాలూ సంయమనం పాటించి వ్యాఖ్యలు చేస్తే మేలు.
పాలక, ప్రతిపక్షాలు హుందాతనం చాటుకుని, సద్విమర్శకు పాల్పడితే ఇంకా ఇంకా మేలు అన్నది విశ్లేషకుల మాట.