మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనుమడు, కాంగ్రెస్ మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి తనయుడు కాసు మహేష్రెడ్డి వైకాపాలో చేరేందుకు రంగం సిద్ధమైంది.ఏపీ పాలిటిక్స్లో కొద్ది రోజులుగా విపక్ష వైకాపాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల ఇన్చార్జ్లు అధికార టీడీపీ గూటికి చేరిపోతున్నారు.
ఈ క్రమంలోనే కాస్త నిస్తేజంతో ఉన్న జగన్కు ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి వస్తోంది.
కాంగ్రెస్లో ఉండి పొలిటికల్ ఫ్యూచర్ కోసం వెయిట్ చేస్తోన్న కొందరు సీనియర్ లీడర్లు వైకాపాలోకి వస్తున్నారు.
ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో సుధీర్ఘ చరిత్ర ఉన్న మాజీ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి మనుమడు, మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి తనయుడు కాసు మహేష్రెడ్డి వైకాపాలో చేరనున్నారు.
ఈ క్రమంలో మహేష్రెడ్డి ఆదివారం గుంటూరు జిల్లాకు చెందిన వైకాపా నాయకులు ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, పార్టీ ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి, నర్సారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలతో కలిసి లోటస్పాండ్లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమయ్యారు.
వైఎస్.జగన్ తండ్రి దివంగత మాజీ సీఎం రాజశేఖర్రెడ్డి, కాసు కృష్ణారెడ్డికి 1978 నుంచే అనుబంధం ఉంది.వీరిద్దరు అప్పుడే అసెంబ్లీకి ఎన్నికయ్యారు.నరసరావుపేటలో ఈ నెల 16న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీలో అధికారికంగా చేరనున్నారు.మహేష్రెడ్డి 2004 నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.2004, 2009 ఎన్నికల్లో తన తండ్రి కాసు కృష్ణారెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించారు.
మహేష్రెడ్డి ఎలాంటి షరతులు లేకుండా పార్టీలో చేరినట్టు చెపుతున్నా ఆయనకు వచ్చే 2014 ఎన్నికల్లో గుంటూరు జిల్లాలోని గురజాల అసెంబ్లీ సీటు ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది.ఈ మేరకు జగన్ మహేష్కు ఇప్పటికే హామీ ఇచ్చారట.
అదే జరిగితే ప్రస్తుతం అక్కడ వైకాపా ఇన్చార్జ్గా ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తికి షాక్ తప్పేలా లేదు.సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జంగాకు 2009లో వైఎస్ సీటు నిరాకరిస్తే, 2014లో వైకాపా తరపున పోటీ చేసిన జంగా ఓడిపోయారు.