కాలంతో పాటు మనము మారాలి.ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి ఏమిటో అర్థం చేసుకొని సినిమాలు చేస్తేనే అవి ఆడతాయి.
తమని తాము అప్డేట్ చేసుకోకుండా, తమ స్టయిల్ లో తీసే సినిమాలు ప్రేక్షకులు ఇప్పటికి కూడా ఇష్టపదతారేమో అనుకోవడం పొరపాటే.జక్కన్ననే తీసుకోండి, ఒకప్పుడు ఊర మాస్ డైరెక్టర్.
భారి డైలాగులు, కమర్షియల్ హంగులునున్న సీన్లు, పాటలతో సింహాద్రీ, విక్రమార్కుడు లాంటి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీసిన దర్శకుడు.మరి ఇప్పుడో ? మర్యాదరామన్న నుంచి మొదలు, రాజమౌళి గతంలో తీసిన సినిమాలకి ఇప్పటికి ఏమైనా సంబంధం ఉందా ? తన స్టయిల్ ని పూర్తిగా మార్చుకోలేదు .అలాగని మూసలో కొట్టుకుపోలేదు.వినూత్న కథలు, సరికొత్త టేకింగ్, ఆ టేకింగ్ కి జతకలిసిన టెక్నాలజీతో ఈరోజు భారతదేశంలోనే నెం.1 దర్శకుడిగా ఎదిగాడు జక్కన్న.ఇప్పటి ప్రేక్షకులకి ఏం కావాలో ఆయనకి బాగా తెలుసు.
ఇది మాస్ మసాలా సినిమాలు ఎలా పడితే అలా తీస్తే ఆడే రోజులు కావు.అందుకే శ్రీనువైట్ల, పూరి జగన్నాథ్, వివి వినాయక్ లాంటి దర్శకులు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు.
ఈ లిస్టులోకి వీరికన్నా ముందే చేరిన దర్శకుడు కృష్ణవంశీ.ఆయన చివరగా తీసిన హిట్ సినిమా ఏమిటి అంటే సడెన్ గా గుర్తుకురావడం కూడా కష్టమే.
అందుకే నక్షత్రం విడుదల కోసం అవస్థలు పడుతోంది.ఈ సినిమా మీద పంపిణిదారులు ఆసక్తి చూపించడం లేదట.
రెజినా, ప్రగ్యలా మీద తీసిన ఘాటు సాంగ్స్ ప్రోమొలను, స్టిల్స్ ని వదిలినా, ముందుకు రావడానికి జంకుతున్నారాట.సినిమా విడుదలపై ఇంకా స్పష్టత లేదంట.
కారణం, ట్రైలర్ దారుణంగా ఉండటమే.
ఈకాలంలో హీరోయిన్లు చేసే ఎక్స్ పోజింగ్ చూడటానికి ఎవరు వెళ్తున్నారు థియేటర్లకి.
ఎవరు పట్టించుకుంటారు హీరోయిన్ చిన్న బట్టలు వేస్తే.కావాల్సింది మంచి కథ మాత్రమే కాదు, ఈతరం వారికి నచ్చే సెన్సిబుల్ టేకింగ్.
నిన్ను కోరి లాంటి హానెస్ట్ సినిమాని కూడా సూపర్ హిట్ చేసారు ప్రేక్షకులు.పెళ్ళి చూపులు లాంటి లైట్ హార్టెడ్ రొమాంటిక్ కామెడిని కూడా బ్లాక్ బస్టర్ చేసారు “మాస్ సినిమాలు మాత్రమే” చూస్తారు అనే తెలుగు ప్రేక్షకులు.
కోన వెంకట్ గురించి మాట్లాడాలి … ఒక మూసలో కొట్టుకుపోయినా ఆయన, నిన్ను కోరితో తన పంథా మార్చుకొని మంచి సినిమాని అందించారు.మరి ఈ దర్శకులు కూడా తమ స్టయిల్ ని మార్చుకుంటే బాగుంటుందేమో.