విజయవాడలో నిన్న ఉదయం ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో ఓ మందుబాబు హల్ చల్ చేశాడు.పటిష్ట బందోబస్తు మధ్య కొనసాగుతున్న సదస్సులోకి ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండానే ఫుల్లుగా మద్యం సేవించిన సదరు వ్యక్తి తానో టీడీపీ నేతనంటూ సమావేశ మందిరంలోకి దూరిపోయాడు.
ఆ సమయంలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మధ్యాహ్న భోజనానికి వెళ్లారు.సదస్సు జరుగుతుండగానే దర్జాగా లోపలికి ప్రవేశించిన సదరు మందుబాబు అక్కడ ఓ కుర్చీలో కూర్చుండిపోయాడు.
దాదాపు అరగంటకు పైగా అక్కడ కూర్చున్న ఆ వ్యక్తిని ఏ ఒక్కరు గుర్తించకపోవడం గమనార్హం.
లంచ్ ముగించుకుని చంద్రబాబు సమావేశంలోకి తిరిగి వచ్చిన తర్వాత కూడా అతడు అక్కడే కూర్చున్నాడు.
ఆ తర్వాత మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్ లు అతడిని గుర్తించి బయటకెళ్లి మరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.మంత్రులు ఫిర్యాదు చేసేదాకా అతడిని గుర్తించని పోలీసులు ఆపై హడావిడి చేశారు.
అతడిని బయటకు తీసుకువచ్చి ప్రశ్నించారు.అయితే తాను టీడీపీ నేతనంటూ అతడు చెప్పడంతో పోలీసులు మారు మాట్లాడకుండా అతడిని వదిలేశారు.
పటిష్ట భద్రత ఉన్న సదస్సులోకి మందుబాబు ప్రవేశించడంపై పోలీసు ఉన్నతాధికారులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.