తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నిర్దోషి కాదు…ఇదీ ప్రతిపక్ష డీఎంకే వాదన.అక్రమాస్తుల కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు జయను దోషిగా తేల్చి శిక్ష విధించినా, కర్నాటక హైకోర్టు ఆమె తప్పు చేయలేదంటూ నిర్దోషిగా విడుదల చేసిన సంగతి తెలుసు.
ఈ తీర్పు తరువాత ఆమె ముఖ్యమంత్రిగా మళ్లీ పీఠం ఎక్కి, తాజాగా ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు.కర్నాటక హైకోర్టు తీర్పు వచ్చిన కొన్నిరోజులకే కర్నాటక ప్రభుత్వం జయ విడుదలను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది.
సోమవారం ప్రతిపక్ష డీఎంకే కూడా ఇదే తీర్పును సవాలు చేస్తూ పిటిషన్ వేసింది.పార్టీ తరపున ప్రధాన కార్యదర్శి అన్బళగన్ పిటిషన్ వేశారు.
దీనిపై సుప్రీం కోర్టు విచారణ ప్రారంభించి ఎంతకాలంలో పూర్తి చేస్తుందో తెలియదు.అక్రమాస్తుల కేసులో జయ దోషి అని చెప్పడానికి బలమైన ఆధారాలు ఉన్నాయని ఈ కేసును పందొమ్మిది సంవత్సరాలు విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ధారించింది.
అన్నేళ్లు విచారించిన ఈ కేసును హైకోర్టు చాలా త్వరగానే తేల్చిపారేసింది.క్లీన్ చిట్ ఇచ్చేసింది.
జయ అక్రమంగా ఆస్తులు సంపాదించారని, అధికారం అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దండుకున్నారని మీడియాలో కథనాలు వచ్చాయి.ఆమె వ్యవహారశైలి కూడా దానికి తగ్గట్లే ఉండేది.
తాజా ఉప ఎన్నికలో గెలిచిన జయలలిత తన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తులు బాగా పెరిగినట్లు చూపించారు.ఆమె తొలిసారి ముఖ్యమంత్రి కాగానే తాను నెలకు రూపాయి మాత్రమే జీతం తీసుకుంటానని ప్రకటించారు.
అప్పట్లో ఆమె త్యాగాన్ని అందరూ ప్రశంసించారు.కాని రూపాయి జీతం పేరు చెప్పుకొని అక్రమాస్తులు సంపాదించారని డాక్టర్ సుబ్రమణ్య స్వామి మొదటగా బయటపెట్టారు.
సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పు మీదనే జయ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది.