కడప గడపలో రాజకీయాలు రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతున్నాయి.ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు సరికొత్త రాజకీయాలకు తెరతీస్తున్నాయి.
శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు రాజకీయాల్లో ఉండరు అనే సూక్తిని నిజం చేసేలా కనిపిస్తున్నాయి.వైఎస్ పేరు చెప్పినా, జగన్ పేరు చెప్పినా తీవ్రంగా విమర్శలు గుప్పించే మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఇప్పుడు వైసీపీలో చేరతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.
సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడం సాధారణమే! అయితే ఇప్పుడు కడప జిల్లాలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ రాజకీయ దుమారం రేగుతోంది.2011లో కడప ఉప ఎన్నికల సందర్భంగా వైఎస్ కుటుంబంపై, జగన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు డీఎల్ రవీంద్రారెడ్డి.అలాగే జగన్పై సవాలు విసిరి జగన్పైనే ఎంపీగా పోటీచేసి ఓడిపోయాడు! ఇప్పుడు ఆయన ఫొటో వైసీపీ నాయకులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీపై కనిపిస్తుండటంతో ఆయన వైసీపీలో చేరిపోతున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి.
డీఎల్ ఫొటోలతో కూడిన వైసీపీ బ్యానర్లు మైదుకూరు నియోజకవర్గంలో హల్చల్ చేస్తున్నాయి.
ఖాజీపేటలోనూ, మైదుకూరు మండలంలోని వనిపెంట, లెక్కలవారిపల్లె తదితర గ్రామల్లో వైఎస్ రాజశేఖర్రెడ్డి, జగన్, ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, వివేకానందరెడ్డి, డీఎల్ రవీంద్రారెడ్డి ఫొటోలతో నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు.
త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ప్రతినిధుల అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డి ఇప్పటికే పలుమార్లు డీఎల్ను కలసి తనకు మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరారు.
దీనిపై డీఎల్ కూడా హామీ ఇచ్చినట్లు సమాచారం.ఈసందర్భంగానే వైసీపీ, డీఎల్ అభిమానులు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారట.మరి జగన్ శత్రువు డీఎల్.వైసీపీలో చేరితే మైదుకూరు నియోజకవర్గంలో వైసీపీ మరింత బలోపేతం అయ్యే ఛాన్సులు ఉన్నాయి.
డీఎల్ వైసీపీలో చేరితే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పరిస్థితి ఏంటన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది.