లోఫర్ నష్టాలకి బాధ్యత వహిస్తూ తమకొచ్చిన నష్టాలని పూరించాలని దర్శకుడు పూరి జగన్నాథ్ ఇంటి మీద, ఆఫీస్ మీద కొంతమంది పంపిణిదారులు దాడి చేసారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.ఇది రూమర్ అనుకోవడానికి వీలు లేదు.
ఎందుకంటే జూబ్లీ హిల్స్ పోలీసులు పూరి అందించిన సమాచారం మేరకు కొంతమంది బయ్యర్లపై కేసు బుక్ చేసారు.ఇదిలా ఉంటే, తాము అసలు పూరి జగన్నాథ్ ఇంటికి కాని, ఆఫీసుకి కాని వెళ్ళలేదు అని చెబుతున్నారు డిస్ట్రిబ్యుటర్లు.
నిందితుల్లో ఒకరైన అభిషేక్ మాట్లాడుతూ ” మేము మూడు నెలల క్రితం తెలుగు ఫిలిం చాంబర్ లో కంప్లేంట్ మాత్రమే ఇచ్చాం.నష్టాలు వచ్చినప్పుడు అందరు చేసే పనే అది.ఆ తరువాత నేను పూరి గారిని ఎప్పుడు కలవలేదు.మేము దాడి చేసినట్లయితే ఆఫీసులో ఉండే సిసి టివిలో కాని, ఆయన ఇంట్లో ఉండే కేమేరాల్లో గాని చిక్కుతాం కదా.మేము దాడి చేయనేలేదు.నేను ఆయనతో ఫోన్లో మాట్లాడి కూడా మూడు నెలలు అవుతోంది” అంటూ తన మీద పడ్డ నిందను ఖండించారు.
” నేను అవిటితనంతో బాధపడుతున్నాను.ఆయన ఆఫీసుకి వెళ్ళి దాడి చేసేంత బలం నా దగ్గర లేదు.
ఆయన సినిమా కెమెరామెన్ గంగతో రాంబాబు కూడా ఈస్టులో నేనే కొన్నాను.అప్పుడు 81 లక్షలు నష్టపోయాను.
ఇప్పుడు లోఫర్ కి కూడా నష్టపోయాను.ఆయన నాకు మంచి స్నేహితుడు.
నేను దాడి చేయలేదు” అని వాఖ్యానించారు మరో నిందితుడు ముత్యాల రామదాసు .
కేసులో మరో నిందితుడు సుధీర్ మాట్లాడుతూ ” నేను గతవారం రోజులుగా ముంబాయిలో ఉన్నాను.అసలు నాకు, లోఫర్ సినిమాకి ఏ సంబంధం లేదు.నా పేరు ఇక్కడ ఎందుకు ఇరికించారో అర్థం కావడం లేదు ” అంటూ వాపోయారు.
డిస్ట్రిబ్యుటర్ల వాదన ఇలా ఉంది.పూరి జగన్నాథ్ మాత్రం వీరి ముగ్గురిపైనా కేసు వేసేసారు.
ఇందులో అబద్ధం ఎవరు ఆడుతున్నట్లు ?
.