టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం నందమూరి తారకరామారావు కొడుకులుగా నందమూరి హరికృష్ణ, నందమూరి బాలకృష్ణ… ఇద్దరు సినీ రంగంలో రాణించారు.తదనంతర కాలంలో కాస్తంత ముందుగానే రాజకీయ తెరంగేట్రం చేసిన అన్న హరికృష్ణ… తన బావ చంద్రబాబు కేబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు.
పార్టీ తరఫున రాజ్యసభకు వెళ్లి వచ్చారు.
పార్టీ అత్యున్నత విభాగం పొలిట్ బ్యూరోలో ఏళ్ల తరబడి సభ్యుడిగా కొనసాగుతూ వస్తున్న హరికృష్ణ… అవకాశం చిక్కినప్పుడల్లా గళం విప్పుతూనే ఉన్నారు.
ఇక ఆయన సోదరుడిగా బాలకృష్ణ సినిమా రంగంలో అన్నను మించిన తమ్ముడిగా ఎదిగారు.ఆ తర్వాత కాస్తంత ఆలస్యంగా గత ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన బాలయ్య… అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్నికై తనదైన శైలిలో రాణిస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న ప్రత్యేక హోదా అంశంపై నేటి ఉదయం అన్నాదమ్ములిద్దరి నోటా ఒకే మాట వినిపించింది.అయితే అన్న స్వరంలో నిరసన జ్వాల ఎగసిపడగా, తమ్ముడి వాదనలో మాత్రం సామరస్యపూర్వక ధోరణి కొట్టిచ్చినట్లు కనిపించింది.
రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ఏపీకి ప్రత్యేక హోదాను కేంద్రం ప్రకటించాల్సిందేనని వారిద్దరూ డిమాండ్ చేశారు.
మహానాడు వేడుకకు దూరంగా ఉన్న హరికృష్ణ నేటి ఉదయం కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి తన తండ్రి ఎన్టీఆర్ కు నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందన్నారు.ఇందుకోసం ఇంటికొకరు చొప్పున ఉద్యమించాల్సి ఉందన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చిననాడే ఎన్టీఆర్ కు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని ఆయన అన్నారు.అయినా ఏపీకి ప్రత్యేక హోదా తెస్తామన్నవారు, ఇస్తామన్నవారు ఇప్పుడేమయ్యారని ఆయన నిరసన గళం వినిపించారు.
ఆ తర్వాత తిరుపతిలో తన బావ చంద్రబాబుతో కలిసి ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన సందర్భంగా బాలయ్య కూడా ఏపీకి ప్రత్యేక హోదా రావాల్సిందేనని వ్యాఖ్యానించారు.ఈ విషయంలో బీజేపీ తాత్సారం చేస్తున్న మాట వాస్తవమేనని ఆయన అన్నారు.
అయితే బీజేపీతో తాను మాట్లాడి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే దిశగా చర్యలు చేపడతానని ఆయన పేర్కొన్నారు.