చిన్న నిప్పురవ్వ ఒంటికి తగిలితేనే సెకను పాటు అతలాకుతలం అయిపోతాం.చలి కాచుకునేటప్పుడు మంట ఎక్కువైనా తట్టుకోలేక దూరం జరిగిపోతాం.
అలాంటిది అమ్మాయిల మీద ఆసిడ్ దాడులు చేస్తారు కొందరు రాక్షసులు.ఇంతకాలం ముఖంపై ఆసిడ్ చల్లడం గురించే విన్నాం.
కాని అప్పటికి ఇప్పటికి మనుషులలో రాక్షసత్వం మరింత పెరిగిపోయిందిగా.అందుకే ఓ అమ్మాయిని రేప్ చేసిందే కాక ఆసిడ్ తాగించాడు ఓ పాపాత్ముడు.
మరింత బాధపడాల్సిన విషయం ఏమిటంటే, ఆ పసిమనసు వయసు ఇంకా 14 ఏళ్ళే.ఇప్పుడిప్పుడే ప్రపంచాన్ని తెలుసుకుంటూ, పాడు ప్రపంచాన్ని అప్పుడే వదిలేసి వెళ్ళిపోయింది.
ఈ సంఘటన, మరో నిర్భయ ఘటనను తలపిస్తూ, దేశ రాజధాని ఢిల్లోలోనే జరిగింది.టీనేజర్ ని రేప్ చేసి నోట్లో ఆసిడ్ పోశాడు.
ఆ బాలిక అంతర్గత అవయవాలన్ని పాడైపోయి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న కన్నుమూసింది.
మరో దారుణమైన విషయం ఏమిటంటే, ఢిల్లి మహిళా కమీషన్ జరిగిన సంఘటనను పోలీసుల దృష్టికి తీసుకొచ్చేదాకా నిందితుడిని అరెస్టు చేయలేదట.
ఈ విషయంపై మహిళా సంఘాలు తీవ్రంగా ధ్వజం ఎత్తుతున్నాయి.మహిళా కమిషన్ ఆధ్యక్షురాలు స్వాతి మలివాల్ ఈ ఘటనపై ప్రభుత్వాన్ని నిందించారు.
ఢిల్లీలో మహిళల సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ ని ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందని ప్రశ్నించారు.మహిళా రక్షణ కోసం హోం మినిస్టర్ ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక కమిటిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు.