తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద చిచ్చునే పెడుతోందట! ముఖ్యంగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సమస్యను తీర్చలేక తల పట్టుకుంటున్నారట.తెలంగాణ సీఎం ఏమిటి? కాంగ్రెస్లో చిచ్చు ఏమిటి? అని అనుకుంటున్నారా? అక్కడికే వద్దాం.బంగారు తెలంగాణలో భాగంగా 10 జిల్లాల తెలంగాణను 31 జిల్లాల మహా తెలంగాణగా విస్తరించారు సీఎం కేసీఆర్.దీంతో ఆయా జిల్లాల్లో డీసీసీ(జిల్లా కాంగ్రెస్ చీఫ్)లను నియమించాల్సిన అవసరం ఏర్పడింది.
అయితే, ఇప్పటి వరకు పదవుల కోసం తెగ ఎదురు చూస్తున్న నేతలు ఒక్కసారిగా బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు.ఆయా డీసీసీ పదవుల కోసం మూగుతున్నారట.
ఈ పదవులు కట్టబెట్టే బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ చీఫ్ ఉత్తమ్కే అప్పగించింది.దీంతో ఈయనపై కొత్త జిల్లాల నేతలు పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తున్నారట.
ఈ క్రమంలో ఆయన మేజిక్ చేశారని తెలిసింది.ఇప్పుడు డీసీసీ పదవి కోరుకుంటే.
వచ్చే 2019 ఎన్నికల్లో టికెట్ ఇచ్చే ప్రశ్నలేదని చెప్పారట.అయినా కూడా కాంగ్రెస్ నేతలు ఏమాత్రమూ వెనక్కి తగ్గకపోగా పై నుంచి ఒత్తడి కూడా పెంచుతున్నారని తెలుస్తోంది.
దీంతో ఉత్తమ్ ఇప్పుడు ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చిందని తెగ ఫీలైపోతున్నారట.ఏం చేయాలో తెలియక, కాంగ్రెస్లో సీనియర్లు తనతో కలిసి రాక నానా తిప్పలు పడుతున్నారట.
సందట్లో సడేమియాలాగా.కొందరు అధిష్టానం దగ్గరికి కూడా వెళ్లి డీసీసీకి సిఫారసులు తెచ్చుకుంటున్నారట.
ఇక, మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్రావు, మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డిలు తెగ పోటీ పడుతున్నారు.పొలిటికల్గా ఈ ప్రాంతం ఎంతో కీలకం.
ఇక, ఖమ్మంలో ఉత్తమ్ పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి చందంగా ఉందట.ఖమ్మం డీసీసీ సత్యం మల్లు భట్టి విక్రమార్క మనిషి.
దీంతో ఆయనను తొలిగించి తన మనిషికి డీసీసీ అప్పగించాలని ఫైర్బ్రాండ్ రేణుకా చౌదరి పట్టుబడుతున్నారంట.దీంతో ఉత్తమ్కి పిచ్చిపడుతోందని సమాచారం.
మొత్తానికి కేసీఆర్ నిర్ణయంతో ఉత్తమ్ చిక్కల్లో పడ్డారనే టాక్ వస్తోంది.మరి ఎలా పరిష్కరిస్తారో చూడాలి.