ప్రత్యేక తెలంగాణే ధ్యేయంగా ఏర్పాటైన అధికార టీఆర్ఎస్ పార్టీ 13 ఏళ్ల పోరాటం తర్వాత తెలంగాణ వచ్చాక అదే తెలంగాణలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఘనత దక్కించుకుంది.ఆ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణకు తొలి సీఎం అయ్యారు.
ఈ 13 ఏళ్ల కాలంలో చూసుకుంటే కేసీఆర్ తర్వాత పోస్టు పార్టీలో జనరల్ సెక్రటరీదే.కేసీఆర్ తర్వాత నెంబర్ 2 పొజిషన్లో ఈ పోస్టు ఉంటుంది.
అయితే ఈ పదవి చేపట్టిన వారికి మాత్రం కలిసి రాలేదు.వారు పార్టీ నుంచి సస్పెన్షన్కు గురవ్వడంతో పాటు వరుస చిక్కుల్లో పడుతున్నారు.
కేసీఆర్ తర్వాత పార్టీ ఆవిర్భవించిన కొత్తలో పార్టీ జనరల్ సెక్రటరీగా సీనియర్ నేత, దిగ్గజం ఆలే నరేంద్ర ఉండేవారు.తర్వాత కేసీఆర్కు ఆయనతో విబేధాలు రావడంతో నరేంద్రను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
ఆ తర్వాత ప్రముఖ సినీనటి, తల్లి తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు విజయశాంతిని పార్టీలో చేర్చుకుని ఆమెకు ఈ పోస్టు కట్టబెట్టారు.తర్వాత ఆమెకు కేసీఆర్ మెదక్ ఎంపీ సీటు ఇవ్వగా ఆమె విజయం సాధించారు.
అంతకు ముందు నరేంద్ర సైతం మెదక్ నుంచే ఎంపీగా గెలిచారు.వీరిద్దరు కూడా తర్వాత కాలంలో పార్టీ నుంచి సస్పెన్షన్కు గురయ్యారు.
ఇక తాజాగా పార్టీలో జనరల్ సెక్రటరీగా ఉన్న రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు సైతం ఇప్పుడు భూకుంభకోణం ఆరోపణల్లో చిక్కుకున్నారు.గోల్డ్స్డోన్ భూముల కుంభకోణంలో కెకెతో పాటు ఆయన కుమార్తె బంజారాహిల్స్ కార్పొరేటర్ విజయలక్ష్మి పేర్లు తెరమీదకు రావడంతో కేసీఆర్ వీరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.కేకే అయినా ఈ వివాదం నుంచి బయటపడతారా ? లేదా ఆయనకు సైతం నరేంద్ర, విజయశాంతి గతే పడుతుందా ? అన్నది చూడాలి.