ఇది వివాహ బంధం కాదు.రాజకీయ బంధం.
ఆ బంధం ‘ఫట్’మంది.ఈ అటాచ్మెంట్ను తెంచుకున్న నాయకుడు ఉమ్మడి రాష్ర్టంలో రెండుసార్లు కాంగ్రెసు రాష్ర్ట అధ్యక్షుడిగా పనిచేసిన ధర్మపురి శ్రీనివాస్ అలియాస్ డీఎస్.
ఆయన టీఆర్ఎస్లో చేరబోతున్నట్లు ఇదివరకే వార్తలు వచ్చాయి.గురువారం ప్రెస్మీట్ పెట్టి ఈ వార్తలను ధ్రువీకరించారు.‘నేను కాంగ్రెసును వీడి టీఆర్ఎస్లోకి పోతున్నాను’ అని అధికారికంగా ప్రకటించారు.దీంతో కాంగ్రెసుతో నాలుగు దశాబ్దాల అనుబంధానికి మంగళం పాడారు.
ఇది తనకు చాలా బాధాకరమైన రోజని, ఎందుకంటే తాను ఇందిరాగాంధీ హయాం నుంచి కాంగ్రెసులో ఉన్నానని చెప్పారు.ఈయన మాజీ మంత్రి కూడా అనే సంగతి తెలిసిందే.
రెండువేల నాలుగో సంవత్సరంలో ‘జోడెద్దులు’ (వైఎస్సార్, డీఎస్) కలిసి కాంగ్రెసును మొదటిసారిగా అధికారంలోకి తెచ్చారు.ఆ విజయంలో డీఎస్ కీలక పాత్ర పోషించారు.
పార్టీ అధినేత సోనియా గాంధీకి డీఎస్ సన్నిహితుడు.ఈయనపై ఈమెకు అపార విశ్వాసం ఉండటంతో రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిని చేశారు.
తనకు పదవులు రాలేదన్న కారణంతో, కౌన్సిల్కు నామినేట్ చేయలేదనే కోపంతో రాజీనామా చేయలేదన్నారు.ప్రధానంగా కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్పై ఆరోపణలు చేశారు.
కౌన్సిల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని ఎంపిక చేసినప్పుడు డిగ్గీ రాజా తనను సంప్రదించలేదని ఆరోపించారు.టీఆర్ఎస్లో చేరిన తాను బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడతానన్నారు.
టీఆర్ఎస్లో ఎలాంటి పదవీ కోరుకోవడంలేదన్నారు.ఎలాంటి పదవీ కోరుకోకుండా ఏ నాయకుడూ పార్టీ మారడనే సంగతి అందరికీ తెలుసు.
పదవి రాలేదనే కోపంతోనే కాంగ్రెసును విడిచిపెట్టాడనే విషయమూ తెలుసు.నాయకలు ఇలాంటి కథలు చెప్పడం మామూలే…!
.