ఏపీ కేబినెట్ ప్రక్షాళన యేడాదిన్నరపాటు ఊరించి ఊరించి ఎట్టకేలకు జరిగింది.చంద్రబాబు ఆశావాహులకే ఊహించని షాకులు ఇస్తూ మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేశారు.
ఇదిలా ఉంటే ఏపీ కేబినెట్ ప్రక్షాళన జరిగి నెల రోజులు కాకుండానే కేంద్ర కేబినెట్ కూడా ప్రక్షాళనకు రంగం సిద్ధమవుతోంది.ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ నెల 27న కేంద్ర కేబినెట్ను ప్రక్షాళన చేస్తారని సమాచారం.
2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మోడీ తన కేబినెట్ను ప్రక్షాళన చేస్తారని వార్తలు వస్తున్నాయి.ఈ ప్రక్షాళనలో సీనియర్లు, జూనియర్లతో సమతుల్యమైన కూర్పు ఉంటుందని తెలుస్తోంది.
ఈ ప్రక్షాళనలో ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీకి మూడో కేంద్ర మంత్రి పదవి రావడం దాదాపు ఖరారైంది.
రాష్ట్రపతి ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మోడీ టీడీపీకి మూడో కేంద్ర మంత్రి పదవి ఇవ్వడంతో పాటు అటు గుస్సాగా ఉన్న శివసేనకు కూడా కీలక పదవులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీకి ఇప్పటికే రెండు మంత్రి పదవులు దక్కాయి.సుజానా చౌదరితో పాటు అశోక్గజపతిరాజు మంత్రులుగా ఉన్నారు.
ఇక వీరితో పాటు టీడీపీ నుంచి మూడో కేంద్రమంత్రి రేసులో మరో ఇద్దరు ఎంపీలు ఉన్నట్టు తెలుస్తోంది.వీరిలో బీసీ కోటాలో మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ, కాపు సామాజికవర్గం కోటాలో కాకినాడ ఎంపీ తోట నరసింహం పోటీ పడుతున్నారు.
తోట నరసింహం గత ఎన్నికలకు ముందే కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి జంప్ చేశారు.కొనకళ్ల రెండుసార్లు మచిలీపట్నం నుంచి ఎంపీగా గెలుస్తున్నారు.
ఆయన ప్రస్తుతం ఏపీ గౌడ సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు.ఆ వర్గానికి టీడీపీ ఎక్కువ ప్రయారిటీ ఇస్తోంది.
ఈ నేపథ్యంలోనే మూడో కేంద్ర మంత్రి పదవి కొనకళ్లకే దక్కవచ్చని తెలుస్తోంది.