ఏపీలో అధికార టీడీపీలో ఇటీవల క్రమశిక్షణ పూర్తిగా గాడి తప్పేస్తోంది.ఒకప్పుడు క్రమశిక్షణకు కేరాఫ్ అంటే టీడీపీ.
చంద్రబాబు ఏపీలో రెండోసారి అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో క్రమశిక్షణ పూర్తిగా గాడి తప్పేసింది.బాబు మాటను ఎవ్వరూ లెక్కచేయడం లేదు.
కొన్ని పంచాయితీల విషయంలో బాబు నాయకులకు, మంత్రులకు పదే పదే వార్నింగ్లు ఇస్తున్నా బాబు మాటను మాత్రం వారు భేఖాతార్ చేస్తున్నారు.
ముఖ్యంగా తన కేబినెట్ సహచరుల్లో నలుగురు మంత్రుల విషయంలో మాత్రం బాబుకు పెద్ద తలనొప్పులే వస్తున్నాయి.
ఉత్తరాంధ్రలోని విశాఖ జిల్లాకు చెందిన మంత్రులు గంటా శ్రీనివాసరావు వర్సెస్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మధ్య జరుగుతోన్న వార్ చంద్రబాబుకు పెద్ద సంక్లిష్టంగా మారింది.చంద్రబాబు వీరికి ఎన్నిసార్లు వార్నింగ్లు ఇచ్చినా వారు మాత్రం ఒకరిమీద ఒకరు బాబుకు పదే పదే ఫిర్యాదులు చేసుకుంటూ వస్తున్నారు.
ఇటీవల విశాఖ భూకుంభకోణంలో గంటాను బద్నాం చేసేందుకు అయ్యన్న ప్రయత్నాలు చేశారు.సిట్కు అయ్యన్న కొన్ని ఆధారాలు కూడా ఇచ్చారు.ఇక గంటా కూడా అయ్యన్నను వీక్ చేసేందుకు జిల్లాలోని తన టీంతో ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు.వీరిద్దరు తగ్గాలని, పార్టీని, ప్రభుత్వాన్ని బజారుకు ఈడ్చకుండా ఉండాలని బాబు చాలాసార్లు చెప్పినా వీరు మాత్రం బాబు మాటలు లైట్ తీస్కొంటూ ఇంకా రెచ్చిపోతున్నారు.
ఇక ఉత్తరాంధ్రలో ఈ ఇద్దరు మంత్రులతోనే బాబుకు పెద్ద చికాకుగా ఉందనుకుంటే ఇప్పుడు అదే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో మంత్రులుగా ఉన్న అచ్చెన్నాయుడు వర్సెస్ కిమిడి కళా వెంకట్రావు మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది.కళా వెంకట్రావుకు మంత్రి పదవి ఇవ్వడం అచ్చెన్నకు సుతారాము ఇష్టం లేదు.
ఇక కళాకు మంత్రి పదవి వచ్చాక వార్ తీవ్రమైంది.
వీరిద్దరు ఒకరిపై మరొకరు పదే పదే అధిష్టానానికి ఫిర్యాదు చేసుకుంటున్నారు.
కళా ఎంట్రీతో తన హవా తగ్గడంతో అచ్చెన్న రగిలిపోతున్నాడు.పలాస మున్సిపల్ ఛైర్మన్ పూర్ణ చంద్రరావు, ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర్ శివాజీ మధ్య వివాదంలో ఇద్దరూ చెరో వర్గానికి కొమ్ము కాస్తున్నారు.
ఇక జిల్లాపై ఆధిపత్యం కోసం వీరి మధ్య తీవ్రస్థాయిలో వార్ జరుగుతోంది.ఏదేమైనా ఉత్తరాంధ్రలోనే నలుగురు మంత్రుల మధ్య జరుగుతోన్న వార్ పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తోంది.
చంద్రబాబు ఈ విషయంలో సీరియస్గా వ్యవహరించకపోతే వచ్చే ఎన్నికల్లో పార్టీకి భారీ నష్టం తప్పదు.