ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తరచుగా సంచలనాత్మకంగా వ్యవహరిస్తుంటారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను చిత్తుగా ఓడించి పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అనేక విషయాల్లో కేంద్రం నానా తిప్పలు పెడుతోంది.ఢిల్లీ పేరుకు రాష్ర్టమైనా అది కేంద్ర పాలిత ప్రాంతం.
ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులకు ఉన్నంత స్వేచ్ఛ ఢిల్లీ ముఖ్యమంత్రికి ఉండదు.కేజ్రీ అయినా, మరో నాయకుడైనా పేరుకే ముఖ్యమంత్రిగాని సంకెళ్లు వేసుకొని పనిచేయాల్సిందే.
కేంద్రంలో, ఢిల్లీ ఒకే పార్టీ అధికారంలో ఉంటే ఢిల్లీ సీఎంకు ఇబ్బందులు ఉండవు.కాని ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా ఉంది.
కేజ్రీవాల్ని కేంద్రం చికాకు పెడుతోంది.ఏ రాష్ర్టంలోనైనా శాంతి భద్రతల బాధ్యత రాష్ర్ట ప్రభుత్వానికే ఉంటుంది.
పోలీసు వ్యవస్థ ముఖ్యమంత్రి, హోం మంత్రి చేతుల్లో ఉంటుంది.వారు ఎంత చెబితే అంత.కాని ఢిల్లీలో పోలీసు వ్యవస్థపై ముఖ్యమంత్రికి అధికారంలేదు.కేంద్రం ఆదేశిస్తే పోలీసులు ముఖ్యమంత్రిని కూడా అరెస్టు చేస్తారు.
ఇంతటి ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ర్ట హోదా కోరుకుంటున్నారు.కేంద్ర పాలిత ప్రాంతంగా వద్దంటున్నారు.అందుకే ఢిల్లీ ఎలా ఉండాలో ప్రజాభిప్రాయ సేకరణ (రిఫరెండం) చేయాలని ఆయన కేంద్రానికి లేఖ రాశాడని సమాచారం.పూర్తిస్థియి రాష్ర్ట హోదాపై రిఫరెండం తప్పనిసరని ఆమ్ ఆద్మీ పార్టీ అంటోంది.
కాని కేంద్రం ఆందుకు ఎందుకు ఒప్పకుంటుంది? కేజ్రీ డిమాండ్ నెరవేరే అవకాశం ఉండకపోవచ్చు.