రెండు తెలుగు రాష్ర్టాల గుండా ప్రవహిస్తున్న గోదావరిలో పుష్కరాల సందర్భంగా కోట్లాదిమంది స్నానాలు చేశారు.ఎంతో పుణ్యం సంపాదించుకున్నారు.
సామాన్యులతోపాటు అనేకమంది ప్రముఖులు స్నానం చేశారు.సినిమా రంగానికి చెందినవారూ కొందరు వచ్చారు.
అయితే బుధవారం మాజీ మెగాస్టార్, ప్రస్తుత కాంగ్రెసు ఎంపీ చిరంజీవి పుష్కరస్నానం చేయడం మీడియాకు పెద్ద వార్తయింది.చిరుతో పాటు ఆయన కుడిభుజం, బావమరిది అయిన అల్లు అరవింద్ కూడా ఉన్నారు.
చిరంజీవి రాజమండ్రిలోని సరస్వతీ ఘాట్లో స్నానం చేశారు.తన కుటుంబంలో స్వర్గస్తులైన పెద్దలకు పిండప్రదానం కూడా చేశారు.
ఇంటికి పెద్ద కొడుకు కాబట్టి ఇలాంటి కర్మకాండలు (సెంటిమెంటు ఉంది కాబట్టి) చేయాల్సిన బాధ్యత చిరుపై ఉంది.ఆయన ఈ పని చేశాడు కాబట్టి మిగతావారికి పట్టింపు ఉండదు.
చిరుతోపాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా వచ్చినట్లు తెలుస్తోంది.చిరంజీవి పుణ్య స్నానం చేయడానికి వచ్చినా మీడియా వదిలిపెట్టదు కదా.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గోదావరి పుష్కరాల ప్రారంభ దినాన జరిగిన తొక్కిసలాటలో చనిపోయినవారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించానని అన్నారు.చిరు సినిమాలు వదిలేసి పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారినా ఆయనను జనం ఇప్పటికీ హీరోగానే చూస్తున్నారు.
పుష్కరాలకు వచ్చిన అనేకమంది యాత్రికులు చిరంజీవిని చూసేందుకు ఎగబడ్డారు.ఆయనతో కరచాలనం చేయాలని, తాకాలని తాపత్రయ పడ్డారు.గత ఎన్నికల్లో కాంగ్రెసు చిత్తుగా ఓడిపోయాక , రాష్ర్టం విడిపోయాక చిరంజీవి రాజకీయాలు మాట్లాడటం మానేశారు.ఆయన రాజ్యసభ ఎంపీ కాబట్టి ప్రజలతో నేరుగా సంబంధాలు ఉండవు.
ఓట్ల కోసమో, ఇమేజ్ పెంచుకోవడం కోసమో ప్రజల మధ్య అదే పనిగా తిరగాల్సిన అవసరంలేదు.ఇలాంటి కార్యక్రమాలకు, ఫంక్షన్లకు వచ్చినప్పుడు మాత్రమే జనం ఆయన్ని కలుస్తున్నారు.