రాష్ట్ర విభజన తరువాత ఉమ్మడి ఆస్తులకు సంబంధించి ఇంకా స్పష్టత రాలేదు.తొమ్మిది, పది షెడ్యూల్ లో ఉన్న ఆస్తుల పంపకాలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరడం లేదు.
ఈ నేపథ్యంలో ఏపీ సీఎం ఉమ్మడి ఆస్తుల విషయమై రాజీపడననే చెబుతున్నారు.అంతేకాదు ఈ విషయమై సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సైతం సై అంటున్నారు.
కేంద్రంతో చర్చించి వివాదం ఓ కొలిక్కి తేవాలని అప్పటికీ కాకుంటే న్యాయ స్థానాన్ని ఆశ్రయించాలన్నది ఆయన భావన.ఇంతకూ చంద్రబాబు పోరాటం ఫలిస్తుందా లేదా అన్నది అసలు విషయం.
ఇప్పటిదాకా ఆస్తుల పంపకం విషయమై తెలంగాణతో అస్సలస్సలు సీరియస్ గా చర్చించని ఏపీ సీఎం తాజాగా కొత్త పల్లవి అందుకోవడం చర్చనీయాంశమైంది.ఇక కేంద్రం ఇరు పక్షాల మధ్య సయోధ్య కుదురుస్తుందో లేదో అన్నది చూడాలి.
ఇక రాష్ట్ర ప్రయోజనా విషయంలో తాను వెనక్కు తగ్గేది లేదంటున్నారు సరే! మరి ఇంతకాలం ఆస్తుల విషయంలో ఏ విధమైన చొరవ చూపారో బాబూనే చెప్పాలి.
ఓటుకు నోటు కేసు అనంతరం తెలంగాణ తో ముడిపడి ఉన్న ప్రతి విషయంపై కూడా బాబు స్పందనలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి.
ఢిల్లీ పెద్దలు సైతం ఆస్తుల పంపకం విషయాన్ని పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదన్నది ఓ విమర్శ.ప్రత్యేక ఉద్యమం నడిచిన సమయంలో ఏపీ భవన్ విషయమై నానా యాగి చేసిన పెద్దలు తరువాత ఏ మేరకు స్పందించారన్నది అందరికీ తెలిసిందే! ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆస్తుల విషయంలో బాబు చెప్పిన మాటలను ప్రజలు ఏ మేరకు అర్థం చేసుకుంటారో అన్నది వేరే సంగతి అసలు సొంత పార్టీ సభ్యులే తమ అధినేత కార్యదక్షతని నమ్ముతారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఏదేమైనప్పటికీ ఆస్తుల పంపకం విషయంలో కాని కృష్ణా జలాల పంపిణీ విషయంలో కానీ మరికొన్ని ఉమ్మడి అంశాలపై కానీ బాబు సర్కార్ కేంద్రం నుంచి ఎటువంటి హామీ పొందలేకపోతుందున్నది సుస్పష్టం.