ఏపీలో మంత్రులుగా విఫలమైన కొందరిని ఇక, స్టేట్ పాలిటిక్స్ నుంచి పూర్తిగా దూరం చేయాలని సీఎం చంద్రబాబు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.ముఖ్యంగా గత కొన్నాళ్లుగా పూర్తి వివాదాల్లోనే కాలం గడుపుతూ… చంద్రబాబుకు కొరకరాని కొయ్యగా మారిన వారిని అటు దూరం చేసుకోలేక, ఇటు వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేక తీవ్రంగా సతమతమవుతున్న చంద్రబాబు అలాంటి వారందరినీ వచ్చే ఎన్నికల తర్వాత స్టేట్ పాలిటిక్స్ నుంచి దూరం చేసి సెంట్రల్కి పంపాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
మంత్రులు గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయడులు కొన్నాళ్లుగా అటు పనితీరు, ఇటు నగదు వ్యవహారాల్లో వివాదాస్పదం అవుతున్నారు.వీరిని ఎంపీలను చేసి ఇక ఢిల్లీ పంపేయాలని బాబు నిర్ణయించుకున్నారు.
అదేసమయంలో కొందరు ఎమ్మెల్యేలు సైతం ఆయన కొరకరాని కొయ్యల్లా మారిపోయారు.వీరికి కూడా ఢిల్లీ పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించారట!
శ్రీకాకుళం ఎంపీగా విజయం సాధించిన రామ్మోహన్నాయుడును ఎమ్మెల్యేగా పోటీ చేయించి ఆయన స్థానంలో ఎంపీగా మంత్రి అచ్చన్నాయుడును పోటీ చేయించే అవకాశాలు ఉన్నాయి.
అనకాపల్లి నియోజకవర్గం నుంచి మంత్రి గంటా శ్రీనివాసరావును ఎంపీగా పంపడం దాదాపు ఖరారైంది.విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని నాని అనేక వివాదాలలో కూరుకుపోవడంతో ఆయనను ఎమ్మెల్యేగా పోటీ చేయించి.
ఎంపిగా ప్రస్తుత జలవనరులశాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ఎంపిక చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందని చంద్రబాబు యోచిస్తున్నారట.
నరసరావు పేట నుంచి ప్రత్తిపాటి పుల్లారావును ఎంపీగా పంపాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
నెల్లూరు ఎంపిగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పోటీ చేయించే విధంగా చంద్రబాబుపై ఒత్తిడి తేవాలని కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారు.హిందూపూర్ ఎంపిగా మంత్రి కాల్వ శ్రీనివాసులను పోటీ చేయించే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుత ఎంపి నిమ్మల క్రిష్టప్పపై ఎమ్మెల్యేలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తుండడంతో ఆయనను మళ్లీ పోటీకి దించే అవకాశాలు లేవు.సో.ఇలా 2019లో మార్పులు చేర్పులపై బాబు ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారని సమాచారం.