నోరెత్తని వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ.మాట్లాడని వ్యక్తి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
నోరెత్తడంలేదన్నా, మాట్లాడటంలేదన్నా ఒక్కటే అర్థం.నరేంద్ర మోదీ తన పాలనలో జరుగుతున్న కుంభకోణాలపైన నోరు మెదపడంలేదు.
పైగా ఆరోపణలు ఉన్నవారిని వెనకేసుకురావడమే కాకుండా, మంత్రుల చేత వారిని పొగిడిస్తున్నారు.అవినీతికి, కుంభకోణాలకు ఆధారాలు ఉన్నాయని ప్రతిపక్షాలు చెబుతున్నా ఏం కామెంట్ చేయడంలేదు.
కేంద్రం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చెప్పినా చంద్రబాబు మాట్లాడటంలేదు.టీడీపీ ఎంపీలు, మంత్రులు ఈ అంశంపై తమకు తోచిన రీతిలో మాట్లాడుతున్నారు.‘ఏ రాష్ర్టానికీ ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే ప్రసక్తే లేదు’ అని కేంద్ర మంత్రి రావు ఇందర్జిత్ సింగ్ పార్లమెంటులో స్పష్టంగా చెప్పినా చంద్రబాబు స్పందించలేదు.కొందరు టీడీపీ నాయకులకు ఆగ్రహం కలిగి కేంద్రాన్ని విమర్శిస్తుంటే బాబు వారిని మందలించారు.
కేంద్రం అవసరం చాలా ఉందని, తిరుగుబాటు చేయకుండానే ప్రత్యేక హోదా సాధించుకోవాలని హితవు చెప్పారు.ప్రధాని మోదీ ఒక్క కుంభకోణాల పైనే కాదు, ఏపీకి ప్రత్యేక హోదాపై కూడా ఏమీ మాట్లాడటంలేదు.
ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని ఎన్నికల ప్రచారంలో తానే చెప్పారు.కాని ఇప్పుడు గమ్మున ఉండిపోయారు.కేంద్ర మంత్రులు ఏపీ ప్రజలను ఇంకా మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.మొత్తం మీద ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి ఏపీ ప్రజలను మోసం చేశారనే భావన కొందరు టీడీపీ నాయకుల్లో కలుగుతోంది.‘ప్రత్యేక హోదా అసలు రాదు’ అని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తన మనసులోని మాట బయటపెట్టారు.చివరకు అదే నిజమైతే బాబు ప్రజలకు ఏం జవాబు చెబుతారు?
.