రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడినప్పటి నుంచి ఏపీ సీఎం చంద్రబాబు – తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య ఉప్పునిప్పులా పోరు జరుగుతోంది.ఓటుకు నోటు తర్వాత ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు టీడీపీ – టీఆర్ఎస్ నాయకుల మధ్య నీళ్లు పోసినా పెట్రోల్ మాదిరిగా మండింది.
ఆ తర్వాత కేసీఆర్ – చంద్రబాబు పలుసార్లు కలుసుకున్నా వీరి మనస్సులు కలిశాయా ? అంటే ఈ ప్రశ్నకు సరైన ఆన్సర్ లేదు.
రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలుగా వీరు చాలాసార్లు కలుసుకున్నారు.
వీరి కలయిక ఏ హైదరాబాద్లోనో, ఢిల్లీలోనో జరిగింది.ఏపీలో మాత్రం వీరు ఒకే ఒకసారి కలుసుకున్నారు.
ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి చంద్రబాబు కేసీఆర్ను ఆహ్వానించగా అప్పుడు మాత్రమే కేసీఆర్ ఏపీ వచ్చారు.తాజాగా ఏపీ భూభాగంలో వీరి కలయికకు మరో సువర్ణ అవకాశం దొరికిందనే చెప్పాలి.
ఈ ఇద్దరు చంద్రుళ్లు ఇటీవల రాష్ట్రపతి గౌరవార్థం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఇచ్చిన విందులో చాలా రోజులకు కలుసుకున్నారు.ఇక ఇప్పుడు మరోసారి ఏపీ సీఎం చంద్రబాబు కేసీఆర్ను తన రాష్ట్రానికి ఆహ్వానించినట్టు తెలుస్తోంది.
కొత్త యేడాది ప్రారంభమవ్వగానే జనవరి 3వ తేదీన విజయవాడకు సమీపంలోని మంగళగిరి వద్ద ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్ కు శంకుస్థాపన జరగనుంది.
ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వస్తున్నారు.
మరో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సంగతి సరేసరి.ఆయన ఎలాగూ ఉంటారు.
ఇక ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న పలు వివాదాలను పరిష్కరించే బాధ్యతలు తీసుకున్న కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ వస్తుండడంతో….ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా రావాలని కేసీఆర్కు చంద్రబాబు ఆహ్వానం పలికారట.
గవర్నర్ విందు సందర్భంగా చంద్రబాబు కేసీఆర్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడంతో కేసీఆర్ సైతం సానుకూలంగానే స్పందించినట్టు సమాచారం.అన్నీ అనుకున్నట్లుగానే జరిగితే… కేసీఆర్ మరోమారు నవ్యాంధ్ర నూతన రాజధానిలో అడుగుపెట్టడం ఖాయంగానే కనిపిస్తోంది.
మరి ఇక్కడ కేసీఆర్ – చంద్రబాబు మధ్య రాజ్నాథ్ సమక్షంలో రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలకు సమాధానం దొరికితే అంతకన్నా ఇరు రాష్ట్రాల ప్రజలకు కావాల్సింది ఏముంటుంది.