ఏపీలో చాలా నియోజకవర్గాల్లో విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను వరుసపెట్టి మరీ సైకిలెక్కించుకుంటూ వారికి చాంతాడంత హామీలు ఇస్తున్నారు సీఎం చంద్రబాబు.వచ్చే ఎన్నికల్లో గెలుపు ప్లాన్లో భాగంగా విపక్ష వైకాపాను ఇప్పటికే చాలా వరకు నిర్వీర్యం చేసే ప్రయత్నంలో బాబు సక్సెస్ అయ్యారు.
పార్టీ మారి టీడీపీలోకి వచ్చిన విపక్ష ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఇప్పటికే రకరకాల హామీలు ఇచ్చేస్తున్నారు.వారిలో కొందరికి మంత్రిపదవి ఇస్తామని ఆఫర్ చేస్తే, మరికొందరికి మళ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు హామీ కూడా ఇచ్చారు.
ఇంతవరకు బాగానే ఉన్నా ఈ జంపింగ్ల పర్వంలో ఇప్పుడు చంద్రబాబు తన పార్టీకే చెందిన ఓ ఎమ్మెల్యేకు టిక్కెట్టు ఇవ్వనని ముందే సంకేతాలు ఇచ్చారా ? అంటే కృష్ణా జిల్లా పాలిటిక్స్లో అవుననే సమాధానాలే వినవస్తున్నాయి.విజయవాడ నగరాన్ని ఆనుకుని ఉన్న పెనమలూరు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా బోడే ప్రసాద్ విజయం సాధించారు.
ఇక కొద్ది రోజుల క్రితం సీనియర్ పొలిటిషీయన్ దేవినేని నెహ్రూ తన కుమారుడు అవినాష్తో కలిసి టీడీపీలో చేరిపోయారు.నెహ్రూకు లేదా ఆయన తనయుడు అవినాష్కు ఎమ్మెల్యే సీటు ఇస్తానని బాబు గ్యారెంటీగా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే నెహ్రూ తాను గతంలో ప్రాధినిత్యం వహించిన కంకిపాడు ప్రాంతాలతో కొత్తగా ఏర్పడిన పెనమలూరుపైనే కన్నేసినట్టు తెలుస్తోంది.
నెహ్రూ సొంత నియోజకవర్గం విజయవాడ తూర్పులో గద్దే రామ్మోహన్ ఉన్నారు.
పక్కనే ఉన్న గన్నవరం నుంచి వల్లభనేని వంశీ ఉన్నారు.ఈ రెండు చోట్ల నెహ్రూకు సీటు కష్టమే.
ఈ క్రమంలోనే నెహ్రూ కన్ను పెనమలూరుపై పడిందని…చంద్రబాబు కూడా నెహ్రూ కోరినట్టే పెనమలూరు ఇచ్చేందుకు ఓకే చెప్పారని తెలుస్తోంది.ఈ మేరకు వీరిద్దరి మధ్య కూడా చర్చలు పూర్తయ్యాయట.
ఇక బోడేకు కూడా ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో సీటు దక్కదన్న సంకేతాలు వెలువడ్డాయన్న టాక్ కూడా అప్పుడే బయటకు వచ్చేసింది.