ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల తరచూ తన కేబినెట్లోని మంత్రులకు వరుసగా క్లాస్ల మీద క్లాస్లు పీకుతున్నారు.మంత్రివర్గ విస్తరణ జరిగితే 6 గురు మంత్రులకు కూడా వేటు తప్పదన్న చర్చలు జరుగుతున్నాయి.
ఈ జాబితాలో చాలా మంది మంత్రుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి.ఈ లిస్టులో అందరికన్నా గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి రావెల కిషోర్బాబు పేరు పైన ఉందని ప్రచారం జరుగుతోంది.
రావెల కిషోర్బాబు ఇటీవల తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు.తాజాగా రావెల తొలగింపుపై టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం లీకులు ఇచ్చారని కొద్ది రోజుల క్రితం వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.
లోకేషే స్వయంగా లీకులు ఇవ్వడంతో రావెల మంత్రి పదవి ఊస్టింగ్ ఖాయమని టీడీపీ వర్గాలు ఫిక్స్ అయ్యాయి.
ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రి రావెలతో పాటు మరో మంత్రి అచ్చెన్నాయుడుకు తీవ్రంగా క్లాస్ పీకినట్టు తెలుస్తోంది.
చంద్రబాబు ఈ ఇద్దరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం.గుంటూరు జడ్పీ చైర్పర్సన్ షేక్ జానీమూన్ మ్యాటర్లో రావెలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు అచ్చెన్నాయుడుకు కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
శ్రీకాకుళం జిల్లాలోని వంశధార ప్రాజెక్టు నిర్వాసితులు ప్రాజెక్టును అడ్డుకునేంత వరకు వారికి పరిహారం చెల్లింపులో ఎందుకు జాప్యం చేశారని అచ్చెన్నపై బాబు మండిపడినట్టు తెలుస్తోంది.ఇద్దరూ కలిసి పార్టీ పరువు తీశారుగా అని బాబు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారట.
ఇక జిల్లాలో అవినీతి ఆరోపణలు కూడా పెరిగిపోతుండడంతో ఆ విషయంపై కూడా బాబు అచ్చెన్నను మందలించినట్టు సమాచారం.