రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల కోసం బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలను బాగా మచ్చిక చేసుకుంది.ఇప్పుడు వీరితో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అవసరం లేదు.2019 ఎన్నికల్లో పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం బీజేపీకి వస్తే తప్ప అప్పటి వరకు టీడీపీ, టీఆర్ఎస్లను మోడీ, అమిత్ షాలు చాలా లైట్ తీస్కోవచ్చు.ఇక విడిపోయిన తమ రాష్ట్రాలకు కేంద్రం నుంచి ఎన్నో నిధులు వస్తాయని నిన్నటి వరకు చంద్రబాబు, కేసీఆర్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
మిగిలిన అభివృద్ధి పనుల సంగతి ఎలా ఉన్నా, వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి రావాలంటే నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి కావడంతో అదన్నా కేంద్రం చేస్తుందని వీరు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందన్న ఆశతో వీరు ఇతర పార్టీల నుంచి భారీగా ఎమ్మెల్యేలను లాగేసుకున్నారు.
ఇప్పుడు వీరితో పాటు సొంత పార్టీ నేతలకు కూడా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు సర్దుబాటు చేయడం కేసీఆర్, బాబుకు కత్తిమీద సామే.
నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఏపీలో 50 స్థానాలు, తెలంగాణలో 34 స్థానాలు పెరుగుతాయి.
అప్పుడు చంద్రబాబు, కేసీఆర్కు తలనొప్పులు తప్పడంతో పాటు వచ్చే ఎన్నికల్లో వీరికి గెలుపు అవకాశాలు సులువు అవుతాయి.అయితే కేందం ప్రత్యేకంగా పూనుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు.
గతంలో పార్లమెంటు చేసిన ఓ రాజకీయ సవరణ ద్వారా 2026 వరకు దేశంలో ఏ రాష్ట్రంలోనూ నియోజకవర్గాలను పెంచే అవకాశం లేకుండా పోయింది.
నిన్నటి వరకు నియోజకవర్గాల పునర్విభజనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బాబు, కేసీఆర్కు కేంద్రం షాక్ ఇచ్చింది.
సీట్ల పెంపుపై కేంద్రం యూటర్న్ తీసుకుంది.తెలుగు రాష్ట్రాల్లో సీట్లను పెంచడం వల్ల తమకు ఇప్పట్లో చేకూరే ప్రయోజనం ఏదీ లేదని, పైగా నష్టమే ఎక్కువని గుర్తించిన ప్రధాని మోడీ.
సీట్ల పెంపు ప్రతిపాదనను వెనక్కి నెట్టేశారు.
ఇక ఇప్పటి వరకు మోడీ ఏదో చేస్తాడని భ్రమల్లో మునిగి తేలిన కేసీఆర్, చంద్రబాబు ఇప్పటి నుంచి బీజేపీ, మోడీతో తాడోపేడో తేల్చుకునేందుకే రెడీ అవుతోన్నట్టు కనపడుతోంది.
వీరిద్దరు ఏపీ, తెలంగాణలో బీజేపీని ఏ మాత్రం ఎదగనీయకుండా చేసే ప్లాన్లు వేసేందుకు రెడీ అవుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.తెలంగాణలో బీజేపీతో పొత్తుకు కేసీఆర్ ఏ మాత్రం ఇష్టపడడం లేదు.
ఇక ఏపీలో కూడా బీజేపీతో తెగతెంపులకే బాబు రెడీ అవుతున్నట్టు కనపడుతోంది.