శత్రువును దెబ్బ కొట్టాలంటే ఆ శత్రువు శత్రువుతో స్నేహం చేయాలి.ఆ స్నేహంతో ఉమ్మడి శత్రువును దెబ్బ తీయొచ్చు.
ప్రస్తుతం భాజపా ఇదే ఆలోచిస్తోంది.ఈ ఏడాది ఆఖరులో జరగబోయే బీహార్ ఎన్నికల్లో గెలవాలని భాజపా గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ-భాజపా అధ్యక్షుడు అమిత్ షా జంటకు బీహార్ ఎన్నికలు సవాలుగా మారాయి.ఢిల్లీలో ఓటమితో కుంగిపోయిన ఈ జంట బీహార్లో అధికారం చేజిక్కించుకుంటామనే విశ్వాసంతో ఉంది.
అయితే అదంత సులభం కాదు.మోదీ ఏడాది పరిపాలన ‘చప్పగా’ ఉందనే ప్రచారం జరుగుతుండటంతో బీహార్లో గెలుపు నల్లేరు మీద నడక కాదు.
ఈ సమయంలో భాజపాకు మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ కనబడ్డారు.బీహార్లో బాగా వెనకబడిన ‘మహాదళిత్’ సామాజిక వర్గానికి చెందిన ఈయనను కూడగట్టుకుంటే దళితుల ఓట్లు పడతాయని కమలం పార్టీ అనుకుంటోంది.
ఈయనను బలవంతంగా కుర్చీలోంచి దింపి నితీష్ కుమార్ కుర్చీ ఎక్కడంతో జితన్ రామ్ జేడీయు నుంచి బయటకు వచ్చేశారు.తానొక పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు.
జేడీయును ఓడించడం ఆయన లక్ష్యం.ఆయన హిందుస్తానీ అవామ్ మోర్చా అనే పార్టీ ఏర్పాటు చేశారు.
ఒకవేళ జితన్ రామ్ పొత్తుకు సిద్ధంగా ఉండి తమను సంప్రదిస్తే సానుకూలంగా వ్యవహరిస్తామని భాజపా నాయకులు చెబుతున్నారు.బలవంతంగా ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోయిన జితన్ రామ్ పట్ల తమకు సానుభూతి ఉందని చెబుతున్నారు.
ఆయన భాజపాతో కలిస్తే నితీష్కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉండొచ్చు.