తెలుగు గడ్డపై పటిష్టమైన పునాది కోసం కమలనాథులు చేయని ప్రయత్నాలంటూ లేవు.ఏపీలో అధికార టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది.
ఈ క్రమంలోనే కేంద్రంలో టీడీపీకి రెండు మంత్రి పదవులు ఇచ్చిన బీజేపీ ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వంలో రెండు మంత్రి పదవులు తీసుకుంది.ఇక తెలంగాణ విషయానికి వస్తే అక్కడ సీఎం కేసీఆర్ దూకుడుకు ప్రతిపక్షాలన్ని కకావిలకమవుతున్నాయి.
టీడీపీ ఇప్పటికే భూస్థాపితమయ్యేదిశగా వెళుతోంది.మరో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సైతం టీఆర్ఎస్ గూట్లోకి జంప్ చేసేశారు.
ఇక వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బలమైన ప్రధాన ప్రతిపక్షంగా అవతరించేందుకు ప్రణాళికలు రచిస్తోన్న బీజేపీ సీఎం కేసీఆర్తో పాటు అధికార టీఆర్ఎస్ను టార్గెట్ చేసేందుకు స్కెచ్ గీసింది.తెలంగాణపై బీజేపీ జాతీయ అధిష్టానం దృష్టి సారించింది.
ఈ క్రమంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు.తెలంగాణలో పార్టీని ఎలా బలోపేతం చేయాలనే వ్యూహ రచనతోనే ఆయన ఈ పర్యటనకు వస్తున్నట్టు సమాచారం.
వాస్తవానికి కొద్ది రోజులుగా కేంద్రంలోని ఎన్డీయే సర్కార్లో టీఆర్ఎస్ చేరుతుందని, ఇక్కడ టీఆర్ఎస్ సర్కార్లో సైతం బీజేపీ చేరుతుందన్న ప్రచారం జరిగింది.అయితే ఇక్కడ సొంతంగా ఎదగాలన్న ఉద్దేశంతో బీజేపీ ఆ ప్రయత్నం విరమించుకున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఇక్కడ పార్టీ కార్యకలాపాలు ఎలా ఉన్నాయనే అంశంపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు ద్వారా బీజేపీ అధిష్టానం ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ పర్యవేక్షణ చేస్తోందని తెలుస్తోంది.
వచ్చే ఎన్నికలకు మరో రెండున్నర సంవత్సరాలు టైం ఉండడంతో ఈ టైంలో అధికార టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా పోరాటం చేసేందుకు ప్రత్యేక స్కెచ్ గీస్తున్నట్టు కూడా బీజేపీ ఇంటర్నల్ సమాచారం.
ఏదేమైనా ఈ వ్యూహం చూస్తుంటే బీజేపీ-టీడీపీ కలిసేలా లేవన్నది స్పష్టంగా కనిపిస్తోంది.