ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ మరో పార్టీని విమర్శించే స్వేచ్ఛ ఉంది.విమర్శించే అధికారం ప్రజలకూ ఉంది.
విమర్శిస్తే అవమానించిట్లా? అదెలా అవుతుంది? అదెలా అవుతుందో భాజపా నాయకులకే తెలియాలి.కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో రైతు బహిరంగ సభ నిర్వహించారు.
ఇందులో మోదీని, ఆయన విధానాలనూ తీవ్రంగా దుయ్యబట్టారు.మోదీ వాగ్దానాలు బూటకమని, రైతులకు, కార్మికులకు శూన్య హస్తాలు చూపిస్తున్నారని అన్నారు.మోదీ ఎన్నికల ప్రచారం కోసం బడా పారిశ్రామికవేత్తల నుంచి కోట్ల రూపాయలు రుణంగా తీసుకున్నారని, ఆ రుణాలు తీర్చే శక్తి లేక రైతుల భూములను వారికి కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు.ఇంకా అనేక విమర్శలు చేశారు.
ఇక చేసింది చాలు ఆపండి అని సోనియా గాంధీ హూంకరించారు కూడా.రైతుల.
పేదల తరపున తాము పోరాటం చేస్తామన్నారు.అయితే ఈ విమర్శలు భాజపా నాయకులకు మరోలా అర్ధమయ్యాయి.
కాంగ్రెసు పార్టీ ప్రజలిచ్చిన తీర్పును అవమానిస్తోందని ధ్వజమెత్తింది.ముప్పయ్ ఏళ్ల తరువాత ప్రజలు స్పష్టమైన మెజారిటీతో భాజపాకు అధికారం ఇచ్చారని, తల్లీ కొడుకులు ఆ తీర్పును అవమానిస్తున్నారని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు.
విమర్శలకు జవాబు ఇవ్వాలి గాని అవమానిస్తున్నారని అనడం అధికారంలో ఉన్నవారికి తగదు.