వైకాపా బాస్ జగన్కు అనుకోని అనుభవం ఎదురైంది.ఒకానొక కథనం ప్రకారం చిత్తూరు జిల్లా ఏర్పేడు రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శిం చేందుకు వెళ్లినా ఆయనకు స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమైంది.
బాధితుల పక్షాన మాట్లాడేందుకు వెళ్లిన జగన్ వీరి తీరుతో విస్తుబోయారు.వైకాపా మీటింగ్కి వచ్చారా అంటూనిలదీశారు.
దీంతో అవాక్కైన స్థానిక నేతలు దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు.బాధితులకు క్షమాపణలు చెప్పారు.
మొత్తానికి జగన్ ఓదార్పు యాత్ర ఆ విధంగా బ్రేక్ పడిందన్నమాట! అటుపై జగన్ మాట్లాడుతూ బాధితులకు పదిలక్షల రూపాయలు చొప్పున పరిహారం చెల్లిస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు.ఇసుక మాఫియా ఆగడాల వలనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు.
ఏదేమైనప్పటికీ కార్యకర్తల అత్యుత్సాహం పుణ్యమాని జగన్ అసలు కార్యం చెడింది.సో.అతి చేస్తే గతి చెడుతుందని అందుకే అంటారు.ఇక సీఎం చంద్రబాబు మాత్రం ఏర్పేడు ప్రమాద ఘటనపై ఓ ఐఏఎస్ అధికారితో విచారణ జరిపిస్తానని చెబుతుంటే ప్రతిపక్షాలు మాత్రం సీబీఐ విచారణకు పట్టుబడుతున్నాయి.
మొత్తంగా ఈ వ్యవహారం రెండు పక్షాల మధ్య తీవ్ర దుమారాన్నే రేపి అసలు విషయాన్ని పక్కకు నెడుతున్నాయన్నది ఇప్పుడు జనం నుంచి వినవస్తున్న ప్రధాన విమర్శ.ఇక పరిహారం విషయమై జగన్ చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా వాస్తవ దూరమే.
ఆయన అడుగుతున్నట్లు ప్రమాద బాధితులకు యాభై లక్షల రూపాయలు ఇవ్వడం సాధ్యం కాదు గాక కాదు.ఇక ఇసుక మాఫియా ఆగడాలను విపక్షం అడుకున్నా అధికార పార్టీ ఇదివరకూ ఆ విషయాన్ని సీరియస్ గాతీసుకున్న దాఖలాలు లేవన్నది జగన్ విమర్శ.
అదేవిధంగా టీడీపీ సర్కార్ తీసుకుంటున్న చర్యలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని విపక్ష నేత అనడం కాదనలేని నిజం.ఇదే సమయంలో పోలీసులు కూడా మాఫీయాకు వంత పాడుతున్నారనడం సబబే కానీ వీటిపై ఇంతవరకూ విపక్షం చేసిన న్యాయ పోరాటం ఏంటన్నది అసలు ప్రశ్న.
అదేవిధంగా కొన్నిసార్లు ఇసుక మాఫియా ఆగడాల నియంత్రణపై కోర్టులు జోక్యంచేసుకున్నా ప్రభుత్వం పెద్దగా స్పందించలేదన్నది ఓ వాదన.ఇలా ఏ విధంగా చూసుకున్నా రాజకీయం మాట అటుంచితే సామాన్య జనం తమ ప్రాణాలు కోల్పోయి రోడ్డున పడుతుంటే నాయకులు మాత్రం ఇదే అదునుగా ఒకరిపై ఒకరు విమర్శాస్త్రాలు సంధిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు.