నోట్ల రద్ది తరువాత కొన్ని రోజులకి కరెన్సి బ్యాన్ వలన ఉప్పు ధర పెరిగిపోయింది, కిలో 400-500 రూపాయల దాకా వెళుతుంది అని ఓ రూమర్ పుట్టుకొచ్చింది గుర్తుందా? జనాలంతా నిజమని నమ్మి కిరాణ కొట్టులకు పరుగులు తీసారు.రెండేసి, మూడేసి ఉప్పు ప్యాకెట్లు ఎగబడి తెచ్చేసుకున్నారు.
మళ్ళీ అలాంటి పరుగే నిన్న తీసారు కర్ణాటక జనాలు.ఈసారి కూడా ఓ రూమర్ వలనే ఇలా జరిగింది.
ఎక్కడినుంచో వచ్చిందో, ఎలా వచ్చిందో కాని, నకిలీ నాణెములు ఎక్కువ అవటం వలన, రూ.10 నాణాలను ఆర్బీఐ బ్యాన్ చేసిందని, ఈ క్షణం నుంచే ఈ నాణెములు చెల్లవని ఓ గాలికబురు కర్టాటకలో పెద్ద దుమారమే రేపింది.నాణేలు ఉన్న ప్రజలు బ్యాంకులకి పరుగులు తీసారు.
బ్యాంకువారికి మొదట అర్థం కాలేదు ఈ రచ్చ ఏంటని.ఆ తరువాత నెమ్మదిగా, ఓపిగ్గా అందరికీ అర్థం అయ్యేలా చెప్పారు, ఇది పుకారు అని, అసలేమాత్రం నిజం లేని గాలికబురు అని.ఈ విషయం అర్బీఐ దాకా వెళ్ళడంతో, ఆర్బీఐ బెంగళూరు శాఖ చీఫ్ మెనేజర్ పీజే థామస్ మీడియాతో మాట్లాడాల్సి వచ్చింది.ఈ వార్తలను నమ్మి ఎవరైనా రూ.10 నాణాలు తీసుకోవడానికి నిరాకరిస్తే నేరంగా పరిగణిస్తామని, ప్రజలు కూడా ఈ రూమర్ ని నమ్మొదని చెప్పుకొచ్చారు.