ఒక సంతోషకరమైన ఘటన జరిగింది.కాని విషాదం ఇంకా గూడు కట్టుకునే ఉంది.‘కిడ్నాప్ కథ’ ఇంకా పూర్తిగా సుఖాంతం కాలేదు.ఆ కథకు శుభం కార్డు పడుతుందా? చెప్పలేం.ఎందుకంటే ఇదంతా ఉగ్రవాదుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంది కాబట్టి.ఇక అసలు విషయానికొస్తే….కొద్ది రోజుల క్రితం లిబియాలో ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్) ఉగ్రవాదులు నలుగురు భారతీయులను కిడ్నాప్ చేసిన ఘటన సంచలనం కలిగించింది.వారి కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందాయి.
వీరు అక్కడి విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు.పాఠాలు చెప్పే గురువులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అనవసరంగా అపహరించారు.
గతంలో అపహరించినవారిని దారుణంగా చంపారు.జర్నలిస్టుల తలలు నరికారు.
ఆ ఘటనలు తలచుకున్న భారతీయులు భయంతో వణికిపోయారు.కిడ్నాప్ అయినవారిలో ఇద్దరు తెలుగువారున్నారు.
ఈ నేపథ్యంలో కర్నాటకకు చెందిన లక్ష్మీకాంత్ రామకృష్ణ అనే అతన్ని కిడ్నాపర్లు వదిలేయడంతో ఆయన మంగళవారం క్షేమంగా హైదరాబాదుకు చేరుకున్నారు.విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది.
ఆయన కుటుంబ సభ్యుల ఆనందం అంబరాన్ని తాకింది.భారతీయులను అపహరించడం తప్పని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అంగీకరించారని రామకృష్ణ చెప్పారు.
వారు తమను మర్యాదగా చూశారని అన్నారు.తాను బాత్రూమ్కు వెళతానంటే వారు చెప్పులు కూడా తెచ్చి ఇచ్చారని వారి మంచితనం గురించి వివరించారు.
ఇంతవరకు బాగానే ఉందిగాని తెలుగువారైన బలరామ్, గోపీకృష్ణ ఇంకా ఉగ్రవాదుల చెరలోనే ఉన్నారు.కిడ్నాప్ చేయడం తప్పని ఒప్పుకున్నప్పుడు, ఆ విషయంలో పశ్చాత్తాపపడుతున్నప్పుడు అందరినీ వదిలేయొచ్చు కదా.కాని ఆ పని చేయకపోవడంతో వారికి ఏదైనా హాని తలపెడతారా? అని కుటుంబ సభ్యులతో పాటు ప్రజలు కూడా భయపడుతున్నారు.విచితమ్రేమిటంటే కిడ్నాపర్లు ఈ అధ్యాపకుల విద్యార్థులే.
వారంతా పదమూడు నుంచి పదిహేడేళ్ల వయసువారు కావడం మరీ విచిత్రం.తమ చెరలో ఉన్న మిగిలినవారి గురించి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని కిడ్నాపర్ల బాస్ చెప్పాడని రామకృష్ణ అన్నారు.
మిగిలినవారిని కూడా విడుదల చేస్తామని వారు హామీ ఇచ్చారట.వారు క్షేమంగా తిరిగి రావాలని మనమూ కోరుకుందాం.