ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది.ప్రస్తుతం ఎన్నికలు జరిగే స్థానాల్లో 90 శాతం సీట్లు అధికార టీడీపీ ఖాతాలోనే పడనున్నాయి.
దీంతో ఆశావాహులు తమ ఛానెల్ ద్వారా పార్టీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు.పార్టీ పది సంవత్సరాల తర్వాత అధికారంలోకి రావడంతో పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డవారు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు.
ఈ క్రమంలోనే హిందూపురం ఎమ్మెల్యే, చంద్రబాబు వియ్యంకుడు బాలయ్య సైతం ఓ ఇద్దరికి ఎమ్మెల్సీ టిక్కెట్లు ఇప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.బాలయ్యకు అత్యంత సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే, సినీ నిర్మాతతో పాటు తనకోసం సిట్టింగ్ ఎమ్మెల్యేగా సీటు త్యాగం చేసిన మరో వ్యక్తికోసం బాలయ్య గట్టి పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది.
వీరిద్దరిలో ఒకరు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మాజీ ఎమ్మెల్యే, సినీ నిర్మాత అంబికా కృష్ణ.అంబికా కృష్ణ బాలయ్యతో వీరభద్ర లాంటి సినిమాలు కూడా నిర్మించారు.
గత ఎన్నికల్లో ప్రస్తుత ఏలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే బడేటి బుజ్జి కోసం తన సీటును కూడా త్యాగం చేశారు.అప్పట్లోనే చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం.
ఇక బాలయ్యతో ఆయనకు ఉన్న సాన్నిహిత్యంతో ఎమ్మెల్సీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఇక బాలయ్య కోసం హిందూపురం మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ సిట్టింగ్ సీటును వదులుకున్నారు.
ఆ తర్వాత బాలయ్యకు, ఘనీకి మధ్య చిన్నపాటి గ్యాప్ వచ్చినా ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణిగినట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఘనీ బాలయ్య ద్వారా ఎమ్మెల్సీ కోసం బాబుపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది.
మరి బాలయ్య లాబీయింగ్ వీరిద్దరిని ఎమ్మెల్సీలను చేస్తుందా ? లేదా ? అన్నది చూడాలి.