ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపురం పేరు చెపితే టీడీపీకి ఎంత కంచుకోటో చెప్పక్కర్లేదు.టీడీపీ ఆవిర్భవించినప్పటి నుంచి అక్కడ టీడీపీ ఓటమి అనేదే ఎరుగదు.టీడీపీ అధికారంలోలేని 2004, 2009 ఎన్నికల్లో కూడా ఇక్కడ టీడీపీ అభ్యర్థులు రంగనాయకులు, అబ్దుల్ ఘనీ విజయం సాధించారు.2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఎన్టీఆర్ నట, రాజకీయ వారసుడు నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఫస్ట్ టైం అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
బాలయ్య ఎమ్మెల్యేగా గెలిచాక నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టించాడు.తొలి రెండేళ్లలో ఇక్కడ బాగానే ఉన్నా తర్వాత బాలయ్య తన వందో సినిమా శాతకర్ణి, ప్రస్తుతం పూరి సినిమాతో బిజీ అయ్యాడు.
ఇక్కడ బాలయ్య పీఏ శేఖర్ అవినీతి, అక్రమాలు శృతి మించడంతో ఏకంగా ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు నిరసన గళం విప్పారు.ఎట్టకేలకు చంద్రబాబు చొరవ తీసుకోవడంతో బాలయ్య పీఏగా శేఖర్ను తప్పించారు.
ప్రస్తుతం బాలయ్య సినిమాల్లో బిజీ అయ్యి నియోకవర్గంవైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో బాలయ్యపై అక్కడ వ్యతిరేకత కనపడుతోంది.మరోసారి బాలయ్య ఇక్కడ పోటీ చేస్తే గెలుపు కష్టమన్న టాక్ సొంత పార్టీ నేతల్లోనే వస్తోంది.
మరో టాక్ ఏంటంటే బాలయ్య వచ్చే ఎన్నికల్లో హిందూపురం నుంచి పోటీ చేయరని, ఆయన చూపులు కృష్ణా జిల్లాలోని పెనమలూరు సీటుపై ఉన్నట్టు తెలుస్తోంది.
నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కృష్ణా జిల్లాలో కొత్తగా ఏర్పడే అసెంబ్లీ సీటు నుంచి బాలయ్య పోటీ చేస్తారని టాక్.
లేని పక్షంలో ఆయన చూపులు పెనమలూరు మీద ఉన్నాయన్న చర్చలు ఏపీ టీడీపీలో జరుగుతున్నాయి.అందుకే బాలయ్య హిందూపురంపై ఇంట్రస్ట్ చూపడం లేదని అంటున్నారు.మరి బాలయ్య మదిలో అసలు ఏముందో ?