కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించాల్సిన ప్రభుత్వ శిశుగృహలో ముగ్గురు చిన్నారుల చేతులపై కాల్చి వాతలు పెట్టిన ఆయాల దురాగతం వెలుగు చూసింది.
గత శుక్రవారం రాత్రి ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా విషయం బయటకు పొక్కింది.ఈ దారుణమంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయింది.
కరీంనగర్ జిల్లా శిశుగృహలో 9 మంది చిన్నారులు ఆశ్రయం పొందుతుండగా వీరికోసం ఉదయం, సాయంత్రం షిప్టుల్లో ముగ్గురు ఆయాలు పనిచేస్తుంటారు.
రాత్రి షిఫ్టులో ఉన్న బుచ్చమ్మ, పద్మ, శారద అనే ఆయాలు చిన్నపిల్లలకు భోజనం పెట్టి అల్లరి చేస్తున్నారన్న కారణంగా వారి చేతులపై స్పూన్ కాల్చి వాతలు పెట్టారు.
ఒక్కరు కాదు ఇద్దరు కాదు చిన్నారులందరికీ ఇలా వాతలు పెట్టారు.బుచ్చమ్మ అనే ఆయా స్టౌవ్ పై స్పూన్ వేడి చేసి ఇవ్వగా పద్మ అనే ఆయా ముగ్గురు చిన్న పిల్లల చేతులపై కాల్చినట్లు సీసీ కెమెరాలో రికార్డయింది.
ఈ విషయం ఉదయం షిప్టుకు వచ్చిన ఆయాలు గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు.దీంతో పిల్లలకు చికిత్స చేయించి, ఆయాలను విధులనుంచి తప్పించారు.
తమను ఆయాలు అన్నం తినకుండా కాల్చారంటూ ఆ చిన్నారులు అమాయకంగా మీడియాకు వివరాలు వెల్లడించారు.ఈఘటనపై ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేశామని సిబ్బంది చెబుతున్నారు.