వైకాపా విజయసాయిరెడ్డికి రాజ్యసభ సీటు ఇవ్వటం పట్ల ఆ పార్టీలోని నేతలందరిలో తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉందని, వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన 17 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించినట్లు సమాచారం .
ఇప్పటికే మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీకి ఓ సీటు ఖరారు చేసిన పక్షంలో మిగిలిన మూడు సీట్లకు సంబంధించి చంద్రబాబు తీవ్ర స్ధాయిలో కసరత్తులు చేస్తున్న నేపథ్యంలో 17 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబుని కలవటం చర్చనీయాంశమవుతోంది.
కాగా రాజ్యసభ నాలుగో అభ్యర్థిని నిలబెట్టేందుకు చంద్రబాబు సిద్దపడుతూ, వైకాపా నుంచి ఇంకా ఎంత మంది జంప్ అవ్వనున్నారో, ఆ ఎమ్మెల్యేలతో చంద్రబాబు చర్చించినట్లు పార్టీ వర్గాలలోనే గుసగుస వినిపిస్తోంది.నాలుగో అభ్యర్ధి గెలుపుకు మరి 15 వరకు శాసన సభ్యుల అవసరం ఉండొచ్చని ఆదిశగా ప్రయత్నాలు ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చినట్లు వైకాపా సభ్యులు వివరించారని తెలుస్తోంది.
వచ్చేవారికి అన్ని విధాలా అండగా ఉంటామన్న సంకేతాలు పంపాలని, బాబు వారికి సూచించారట…
నాలుగో అభ్యర్ధి విషయమై వైకాపా నుంచి వచ్చిన శాసనసభ్యుల సలహా కోరటం మరి కొందరికి పచ్చ కండువా కప్పెందుకే నని విశ్లేషకుల కథనం.అయితే ఇప్పటికే తన పార్టీ శాసనసభ్యులందరినీ ఇతర రాష్టాలకు పంపి, క్యాంపు రాజకీయాలకు తెరలేపిన జగన్, చంద్రబాబు చతురతను అడ్డకునేందుకు ఉమ్మారెడ్డితో పాటు మరి కొందరి సీనియర్లను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది.
దేశం నాలుగో అభ్యర్ధిని ఓడించడం ద్వారా తెలుగుదేశం పతనానికి నాంది పలికామని తెలిపేందుకు రాజ్యసభ ఎన్నికలు పూర్తయ్యేవరకు అంతా తనకు అందుబాటులో ఉండాలని జగన్ సీనియర్లకు స్పష్టం చేసినట్టు సమాచారం
.