రాజమౌళి బాహుబలి – ది కంక్లూజన్ థియేటర్లలోకి వచ్చేందుకు మరో మూడు రోజుల టైం మాత్రమే ఉంది.ఈ సినిమాపై ఉన్న క్రేజ్ మామూలుగా లేదు.
ఈ క్రేజ్ క్యాష్ చేసుకునేందుకు దేశవ్యాప్తంగా ఉన్న మల్టీఫ్లెక్స్లు అన్ని కార్పొరేట్ దందాకు తెరలేపాయి.ఈ దందాలో ఏపీ, తెలంగాణలోని అన్ని మల్టీఫ్లెక్స్లు కొత్త ఆఫర్లు అంటూ ప్రేక్షకుడి జేబుకు భారీగా చిల్లు పెట్టనున్నాయి.
ఇక గ్రేటర్ హైదరాబాద్లోని థియేటర్లు దోపిడీకి అయితే బ్రేకుల్లేవన్నట్టుగా ఉంది.
టిక్కెట్టుతో పాటు బలవంతంగా తినుబండరాలు, డ్రింకులు ప్రేక్షకుడికి అంటగడుతూ టిక్కెట్ రేటును ఏకంగా 75 శాతం పెంచేశాయి.
ప్రేక్షకుడు సినిమా చూసేందుకు వస్తాడు.వీళ్లలో చాలామందికి డ్రింకులు తాగడం, పాప్ కార్న్ తినడం ఇష్టం ఉండదు.
అయినా ప్రేక్షకుడికి వాటిని బలవంతంగా అంటగట్టేందుకు మల్టీఫ్లెక్స్ల యాజమాన్యాలు రెడీ అవుతున్నాయి.
ప్రేక్షకుడికి కూల్డ్రింక్, పాప్ కార్న్ ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ థియేటర్లో బాహుబలి చూడాలన్నా, టిక్కెట్టు కావాలన్నా కాంబో ఆఫర్ కింద భారీగా చేతిచమురు వదిలించుకోవాల్సిందే.
ప్రస్తుతం బాహుబలి కోసం హైదరాబాద్ మల్టీఫ్లెక్స్లలో బల్క్ బుకింగ్ జరుగుతోంది.సాధారణంగా టిక్కెట్టు ధర రూ.150 ఉంటే కాంబో ఆఫర్ కింద రూ.250-300 అదనంగా వసూలు చేస్తున్నారు.
దీంతో టిక్కెట్టుతో పాటు ఫుడ్ కూపన్లు, డ్రింక్ కూపన్లు, పాప్ కార్న్ కూపన్లు బలవంతంగా అంటగడుతున్నారు.ఈ ఆఫర్లో భాగంగా ఓ కోక్, పాప్కార్న్, ఓ సమో సా ఇస్తారు.
ఇలా ఒక్కో షోలోని టికెట్లన్నీ విక్రయించడం ద్వారా లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారు.ప్రేక్షకుడికి బాహుబలి టిక్కెట్టు కావాలి.
ఈ బలహీనతను వారు బాగా క్యాష్ చేసుకుంటున్నారు.ఏదేమైనా బాహుబలి క్రేజ్తో భారీ దోపిడీకి తెరలేస్తోంది.