ఏపీలో అధికార టీడీపీ నుంచి శాసనమండలికి వెళ్లే పెద్దల జాబితా ఓ కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది.సామాజికవర్గాలు, ప్రాంతాలను భేరీజు వేసుకున్న సీఎం చంద్రబాబు ముందుగా పార్టీలో ఎప్పటి నుంచో ఉంటోన్న సీనియర్లకు ప్రాధాన్యత కల్పించాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
మండలిలో మొత్తం ఏడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
వీరిలో శాసనసభలోని బలాబలాను బట్టి టీడీపీకి ఐదు, వైసీపీకి ఒక స్థానం దక్కనుంది.
ఆరో అభ్యర్థిని కూడా గెలిపించుకునేందుకు సీఎం పక్కా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.ఈ జాబితాను ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత సీఎం అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.
మొత్తం ఆరు స్థానాల్లో చంద్రబాబు కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి రెండు సీట్లు, సీనియర్లకు నాలుగు సీట్లు కేటాయిస్తారని తెలుస్తోంది.ఇక ఇంటర్నల్గా వినపడుతోన్న సమాచారం మేరకు కమ్మ సామాజిక వర్గంలో రాయలసీమ నుంచి ముందునుంచి అందరూ ఊహిస్తున్నట్టుగానే సీఎం తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు చోటు దక్కింది.
కోస్తాలోని కృష్ణాజిల్లా నుంచి దేవినేని నెహ్రూ, కాపు సామాజిక వర్గం నుంచి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి చిక్కాల రామచంద్రారావు, ఉత్తర కోస్తాలోని విజయనగరం జిల్లా నుంచి బీసీ మహిళ, రాష్ట్ర తెలుగుమహిళా అధ్యక్షురాలు శోభా హైమావతిలకు ముఖ్యమంత్రి గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
గుంటూరు జిల్లాలో ఎస్సీ మాల వర్గానికి చెందిన ఎవరికి అయినా ఐదో సీటు ఇస్తారట.
ఇక ఆరో సీటుకు ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, నెల్లూరు జిల్లాకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి పేరు వినపడుతోంది.వేమిరెడ్డికి వైసీపీలో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి.
దీంతో ఆరో సీటుకు వేమిరెడ్డితో పోటీ పెట్టిస్తే వైసీపీ ఓట్లు కూడా క్రాస్ అవుతాయన్నదే చంద్రబాబు ప్లాన్గా తెలుస్తోంది.