ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గాన్ని విస్తరిస్తారంటూ దాదాపు యేడాదిన్నర కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి.త్వరలో ఉగాదికి ఏపీ కేబినెట్లో భారీ ప్రక్షాళన ఉంటుందని మరోసారి వార్తలు ఊపందుకున్నాయి.
ఈ ప్రక్షాళనలో కూడికలు – తీసివేతల లెక్క భారీగానే ఉండబోతోందని ఇప్పటికే బాబు లీకులు ఇస్తున్నారు.ప్రస్తుతం బాబు కేబినెట్లో ఉన్న వారిలో ఐదారుగురు మంత్రులపై భారీ అవినీతి ఆరోపణలు, వ్యతిరేకత ఉండడంతో వారిని తొలగించి వారి స్థానాల్లో ఆయా సామాజికవర్గాలకు చెందిన వారితో ఆ పదవులను భర్తీ చేస్తారని.
ఇందుకు కసరత్తు జరుగుతోందని కూడా వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే ప్రక్షాళనలో తన పోస్టు ఊస్ట్ అవుతుందన్న డౌట్తో ఉన్న ఓ మంత్రి ఇప్పుడు పదే పదే చంద్రబాబు భజన చేస్తున్నారన్న గుసగుసలు ఆ జిల్లాలో వినిపిస్తున్నాయి.
రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి పదవీ గండం భయం పట్టుకుందన్న చర్చలు ఏపీ టీడీపీలో వినిపిస్తున్నాయి.తన మంత్రి పదవి పోకుండా ఉండేందుకు అయిన దానికి, కాని దానికి ముఖ్యమంత్రి చంద్రబాబును ఆకాశానికి ఎత్తుతుండటంపై ఏపీ టీడీపీ నాయకులు పలు ఛలోక్తులు విసురుతున్నారు.
ఇటీవల పల్లె ప్రెస్మీట్ పెట్టినా, ఏ సభలో అయినా చంద్రబాబు భజన ప్రస్తావన లేకుండా ఆ కార్యక్రమం ముగించడం లేదంట.ఏపీ అభివృద్ది కోసం అహర్నిశలు కష్టపడుతోన్న చంద్రబాబును అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని….
ఒకప్పుడు ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ లాంటి నాయకులను కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్న ఘనత నారా వారిది అంటూ పల్లె పదే పదే బాబును ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
ఇదే అంశంపై ఇప్పుడు అనంతపురం జిల్లాలో కూడా చర్చలు నడుస్తున్నాయి.
పల్లె పేరు బాబు కేబినెట్ నుంచి ఊస్టింగ్ లిస్టులో ఉందని… అందుకే బాబుపై ఎక్కడ లేని స్వామిభక్తిని ప్రదర్శిస్తున్నారని గుసగుసలాడుకుంటున్నారు.ఇక పల్లెను తప్పిస్తే ఇదే జిల్లా నుంచి ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ మంత్రి పదవిని ఆశిస్తున్నారు.
అలాగే రెడ్డి కోటాలో పల్లె పోస్టు కోసం చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు.