ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంతవరకూ వచ్చింది?…ఇదీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీస్తున్న విషయం.ఆయన దాదాపు ప్రతిరోజూ ఫోన్ ట్యాపింగ్పై పోలీసు ఉన్నతాధికారులతో చర్చిస్తూనే ఉన్నట్లు సమాచారం.
మంగళవారం ఏపీ డీజీపీ రాముడితో చర్చలు జరిపారు.డీజీపీతో బాబు ఏకాంతంగా మాట్లాడటంతో వివరాలు బయటకు పొక్కకపోయినా ఫోన్ ట్యాపింగ్ పైనే మాట్లాడారని తెలుస్తోంది.
నోటుకు ఓటుకు కేసులో టీటీడీపీ ఎమ్మల్యే రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆ విషయం కూడా చర్చకు వచ్చిందట…! ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించి సిద్ధంగా పెట్టుకోవాలని బాబు డీజీపీ రాముడును ఆదేశించారు.ఓ పక్క ఇద్దరు చంద్రులు రాజీపడతారనే వార్తలు హల్చల్ చేస్తున్నప్పటికీ చంద్రబాబు మాత్రం అస్ర్తాలు సిద్ధం చేసుకుంటున్నారు.
పరిస్థితి ఎలా ఉన్నా తన జాగ్రత్తలో తను ఉండాలి కదా…! ఆంధ్రాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై కేసులపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే కదా.వాళ్ల పని ఎంతవరకు వచ్చిందో కూడా బాబు తెలుసుకుంటున్నారు.రోజువారీ పాలనా వ్యవహారాల్లో మునిగితేలుతున్నా కేసులపై ఆరా తీయడం మాత్రం మానుకోవడంలేదు.బాబు తాను నిద్రపోడు.అధికారులను నిద్ర పోనివ్వడు.