ఏపీలో మంత్రివర్గ ప్రక్షాళన వార్తలు టెన్షన్ టెన్షన్గా మారాయి.ఈ ప్రక్షాళన కేబినెట్లోకి ఎంట్రీ ఇచ్చే ఆశావాహులతో పాటు కేబినెట్ నుంచి అవుట్ అయ్యేవారితో పాటు రాజకీయ వర్గాల్లో సైతం ఈ మంత్రివర్గ ప్రక్షాళన ఎలా ఉంటుందా అన్న ఆసక్తి నెలకొంది.
ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఉగాది రోజున కేబినెట్లో మార్పులు – చేర్పులు ఉంటాయని టీడీపీలో విశ్వసనీయవర్గాల సమాచారం.ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు మంత్రివర్గ ప్రక్షాళన చేపడితే ఆశావాహుల నుంచి ఇబ్బందులు వస్తాయని భావించిన చంద్రబాబు ఎన్నికల తర్వాతే ప్రక్షాళనకు రెడీ అవుతున్నారని కూడా తెలుస్తోంది.
ఇక ముందునుంచి వినిపిస్తున్నట్టుగానే చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ మున్సిపల్–పట్టణాభివృద్ధి, ఐటీ శాఖలు ఇవ్వనున్నారు.ప్రస్తుతం మున్సిపల్ శాఖ నిర్వహిస్తున్న నారాయణను మంత్రివర్గం నుంచి తప్పించి, సీఆర్డీఏ చైర్మన్ పదవిని ఇస్తారని పార్టీవర్గాలే చర్చించుకుంటున్నాయి.
ప్రస్తుతం కేబినెట్లో కొనసాగుతోన్న వారిలో ఆరుగురు లేదా ఏడుగురికి ఉద్వాసన ఖాయంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కిమిడి కళా వెంకట్రావుకు బెర్త్ కన్ఫార్మ్గా తెలుస్తోంది.
ఇక కళా వెంకట్రావు ప్రాధినిత్యం వహిస్తోన్న శ్రీకాకుళం జిల్లా నుంచే మంత్రిగా ఉన్న అచ్చెన్న పనితీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.మరి అచ్చెన్నకు బాబు ఉద్వాసన పలుకుతారా ? లేదా ? అన్నది మాత్రం చివరి వరకు కాని తేలేలా లేదు.
అనంతపురం జిల్లాకు చెందిన సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డితో పాటు వరుస వివాదాలకు కేరాఫ్గా మారిపోయిన రావెల కిషొర్బాబు, పీతల సుజాతతో పాటు వ్యవసాయశాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును కూడా తప్పిస్తారని తెలుస్తోంది.ఇక కొత్తగా మంత్రివర్గంలోకి ఎంట్రీ ఇచ్చేవారిలో ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, సీనియర్ లీడర్, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రాజోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పేర్లు వినిపిస్తున్నాయి.
ఇక ఇటీవల కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన మహ్మద్ జానీకి మైనారిటీ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియతో పాటు చిత్తూరు జిల్లాకు చెందిన అమరనాథ్రెడ్డి, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ రంగారావులకు కూడా మంత్రి పదవులు దక్కవచ్చని పార్టీ వర్గాలు పేర్కొంటు న్నాయి.
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చే విషయంలో ఆయా జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.మరి వీరి విషయంలో చంద్రబాబు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి.