ఏ మనిషీ పూర్తిగా మంచివాడు కాదు…పూర్తిగా చెడ్డవాడు కాదు.ఇదొక సార్వజనీన అభిప్రాయం.
కాని కొందరి దృష్టిలో కొందరు వ్యక్తులు ‘శాశ్వతమైన పాపాత్ములు’గా ఉంటారు.జీవితాంతం వారు ప్రధాన శత్రువులు.
ఏం జరిగినా వారే కారణమంటారు.తమ స్వయంకృతాపరాధాలకు కూడా వారినే వేలెత్తి చూపుతారు.
వ్యక్తిగతంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనస్తత్వం, పార్టీగా టీఆర్ఎస్ విధానం ఇటువంటివే.దీని వెనక రాజకీయం కూడా ఉందనుకోండి.
తెలంగాణకు జరిగే ప్రతి ఒక్క నష్టానికి, వెనకబాటుకు కేవలం టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమే కారణమని కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు.ఇది వారు తెలంగాణ ప్రజలతో ఆడుతున్న మైండ్ గేమ్ అన్నమాట.‘చంద్రబాబు తెలంగాణ ద్రోహి’ అనే అభిప్రాయం తరతరాలుగా చెరిగిపోకూడదనేది వారి వ్యూహం.ఉమ్మడి రాష్ర్టాన్ని చంద్రబాబు తరువాత పదేళ్ల పాటు కాంగ్రెసు పరిపాలించింది.
కాని ఆ విషయానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు.ఈమధ్య కాలంలో తెలంగాణలో వరుసగా జరుగుతున్న రైతుల ఆత్మహత్యలకు కూడా చంద్రబాబే కారణమని టీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు.
అంటే కేసీఆర్గాని, టీఆర్ఎస్ నాయకులుగాని పూర్తిగా పుణాత్ములు.దీపం పెట్టి వెతికినా వారిలో లోపాలు కనబడవు.
రెండువేల నాలుగో సంవత్సరంతో బాబు పాలన ముగిసిపోయింది.ఆయన పాలనేమీ గుప్తుల స్వర్ణయుగం వంటిది కాదు.
అనేక తప్పులు జరిగాయి.లోపాలున్నాయి.
కాని తరువాత పదేళ్లు కేంద్రంలో, రాష్ర్టంలో కాంగ్రెసు పాలన సాగింది.ఆ పార్టీ పాలనలో ఎటువంటి తప్పులూ జరగలేదా? రాష్ర్టం విడిపోయినప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెసే కదా.ఆస్తులైనా, అప్పులైనా, నష్టాలైనా,లాభాలైనా కాంగ్రెసు పాలకుల నుంచే టీఆర్ఎస్ సర్కారుకు బదిలీ అయ్యాయి.కాని తెలంగాణలో టీడీపీని మట్టుబెట్టాలనే ఆలోచనతో వ్యూహాత్మకంగా కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు.
తాజాగా ఒక విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం బాబు మీద విరుచుకుపడుతోంది.ప్రపంచ బ్యాంకు తన నివేదికలో ఆంధ్రప్రదేశ్కు రెండో స్థానం ఇచ్చి, తెలంగాణకు పదమూడో స్థానం ఇచ్చింది.
దీనిపై టీఆర్ఎస్ మండిపడుతోంది.ప్రపంచ బ్యాంకు తెలంగాణకు పదమూడో స్థానం ఇవ్వడంపై చంద్రబాబు కుట్ర ఉందని, ఆయన ప్రపంచ బ్యాంకు అధికారులను ప్రభావితం చేశారని అంటోంది.
తెలంగాణకు పెట్టుబడులు రాకూడదనే దురుద్దేశంతోనే ఈ కుట్ర చేశారని చెబుతోంది.దేశంలో గుజరాత్ మొదటి స్థానంలో ఉండగా, ఏపీ రెండో స్థానంలో ఉందని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలియచేసింది.
ఈ నిదేదికపై తమకు సందేహాలు ఉన్నాయని టీఆర్ఎస్ చెప్పింది.ఎన్డీఏ పాలిత రాష్ర్టాలే అత్యున్నత ర్యాంకుల్లో ఉన్నాయని తెలిపింది.
మూడో స్థానం నుంచి ఆరో స్థానం వరకు కూడా ఎన్డీఏ పాలిత రాష్ర్టాలే ఉన్నాయి.ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టుబడుల కోసం చైనా వెళ్లిన సమయంలోనే ఈ నివేదిక విడుదల కావడం పట్ల టీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు.
ప్రపంచ బ్యాంకు నివేదికలో పాదర్శకత లేదన్నారు.చంద్రబాబు పాలనలో ప్రపంచ బ్యాంకు ప్రముఖ పాత్ర పోషించిన మాట వాస్తవం.
కాబట్టి ఆయన ప్రపంచ బ్యాంకు అధికారులను ప్రభావితం చేసి తెలంగాణకు వెనక్కి నెట్టారని అనుకోవడం కరెక్టేనా?
.