ఏపీలో అధికార టీడీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ఇప్పుడు వికర్ష్ అవుతోంది.నిన్నటి వరకు విపక్ష వైసీపీ నుంచి పలువురు ప్రజాప్రతినిధులు వరుసపెట్టి సైకిలెక్కేశారు.
మొత్తం వైసీపీ నుంచి 29 మంది ప్రజాప్రతినిధులు టీడీపీ గూటికి చేరిపోయారు.ఇక ఇప్పుడు వీళ్లంతా టీడీపీలో చేరడంతో అక్కడ పాత టీడీపీ నాయకులకు ఈ జంపింగ్ నాయకులకు అస్సలు పొసగడం లేదు.
వీరి మధ్య సయోధ్యకు చంద్రబాబు ఎన్నిసార్లు ప్రయత్నాలు చేస్తున్నా అవి ఫలించడం లేదు.
ఇదిలా ఉంటే ఇప్పుడు టీడీపీ నుంచి విపక్ష వైసీపీలోకి వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది.
నంద్యాల ఉప ఎన్నికల్లో సీటు విషయమై హామీ రాకపోవడంతో మాజీ మంత్రి శిల్పా మోహన్రెడ్డి టీడీపీకి షాక్ ఇచ్చి వైసీపీలో చేరిపోయారు.ఆయన వైసీపీలో చేరిన వెంటనే ఆయనకు జగన్ వైసీపీ సీటు ఇచ్చేశారు.
ఇక ఇప్పుడు ఆయన శిల్పా సోదరుడు, టీడీపీ ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డి వంతు వచ్చింది.
సోదరుడు పార్టీ మారినా శిల్పా చక్రపాణిరెడ్డి మాత్రం టీడీపీలోనే కంటిన్యూ అవుతూ వస్తున్నాడు.
అయితే ఆయన్ను టీడీపీ నమ్మడం లేదు.ఆయన్ను నంద్యాల ఉప ఎన్నిక ప్రచారానికి కూడా పిలవడం లేదు.
ఆయన పార్టీలో అంతర్గత విషయాలు తన సోదరుడు మోహన్రెడ్డికి ఎక్కడ చేరవేస్తాడనే డౌట్ టీడీపీకి ఉంది.
టీడీపీలో తాను ఎంతో నమ్మకంతో ఉన్నా టీడీపీ మాత్రం తనను నమ్మకపోవడంతో తీవ్ర అవమానంగా భావిస్తోన్న చక్రపాణిరెడ్డి టీడీపీ వీడేందుకు దాదాపుగా నిర్ణయం తీసేసుకున్నారని తెలుస్తోంది.
ఉప ఎన్నికకు ముందే ఆయన వైసీపీలో చేరేందుకు మంచి ముహూర్తం చూసుకుంటున్నట్టు తెలుస్తోంది.మరి శిల్పా అధికార పార్టీ నుంచి విపక్ష వైసీపీలోకి వెళితే రాజకీయం కొత్తగా మారడం ఖాయం.