ఒకప్పటి ప్రముఖ కాంగ్రెసు నాయకుడు, ప్రస్తుతం అనంతపురం పార్లమెంటు సభ్యుడైన జేసీ దివాకర్ రెడ్డి కొంతకాలంగా అసహనంగా ఉంటున్నారు.ఎందుకో అర్థం కావడంలేదు.‘ప్రత్యేక హోదా’ అంశాన్ని ఆసరాగా చేసుకొని చిర్రుబుర్రులాడుతున్నారు.ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు మీద కోపమా? ఇంకెవరి మీదైనా ఆగ్రహమా? డైరెర్టుగా చంద్రబాబును ఏమీ అనలేక ప్రత్యేక హోదా పేరుతో పరోక్షంగా విమర్శిస్తున్నారా? తాజాగా ఈ కోపం వైకాపా అధినేత వైఎస్ జగన్పై చూపించారు.ఏపీకి ప్రత్యేక హోదా రాదనేది జేసీ మొదటి నుంచి చెబుతున్న మాట.కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సహా భాజపా నాయకులు ‘ఇస్తాం…ఇస్తాం’ అంటున్నారు.చంద్రబాబు సహా టీడీపీ మంత్రులు, నాయకులు ‘తెస్తాం…తెస్తాం’ అంటున్నారు.ఒక్క జేసీ దివాకర్ రెడ్డి మాత్రమే ‘తల్లకిందులు తపస్సు చేసినా ప్రత్యేక హోదా రాదు’ అని చాలాకాలంగా బహిరంగంగానే అంటున్నారు.
ప్రత్యేక హోదా రాదనే సంగతి బాబుకు, మంత్రులకు తెలిసినా బయటకు చెప్పరు కదా….! వస్తుందనే ప్రజలను నమ్మిస్తారు.
ఒక్క జేసీ మాత్రమే ఇందుకు మినహాయింపు.మరి ప్రత్యేక హోదా ఇవ్వడంలేదని భాజపా మీద కోపమా? కేంద్రంపై ఒత్తిడి తేవడంలేదని బాబు మీద కోపమా? తెలియడంలేదు.కొంతకాలం కిందట పవర్స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హఠాత్తుగా విలేకరుల సమావేశం పెట్టి టీడీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయడంలేదంటూ చెడామడా దులిపేశాడు.ఆ తరువాత దీనిపై టీడీపీ నాయకులు పవన్ను బాగా విమర్శించారు కూడా.
ఈ నేపథ్యంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాల సమయంలో ఒకరోజు టీడీపీ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో చిన్నపాటి ధర్నా చేశారు.ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.ఈ నిరసన కార్యక్రమాన్ని తెలుగు టీవీ ఛానెళ్లు, పత్రికలు తప్ప జాతీయ పట్టించుకోలేదు.ఆ సందర్భంగా జేసీ మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇవ్వరు.
ఆ సంగతి స్పష్టంగా తెలుసు.పవన్ కళ్యాణ్ను సంతృప్తిపరచడం కోసమే ధర్నా చేశాం…అని మొహమాటం లేకుండా చెప్పారు.
ఆ తరువాత మరో రెండుమూడు సార్లు ఇదే విషయం చెప్పారు.పదిహేను రోజుల్లో ప్రత్యేక హోదాకు సానుకూలంగా కేంద్రం ప్రకటన చేయకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని వైకాపా అధినేత వైఎస్ జగన్ కొద్ది రోజుల క్రితం ప్రకటించారు.
దీనిపై స్పందించిన జేసీ దివాకర్ రెడ్డి ‘వాడు ఆమరణ నిరాహార దీక్ష చేయడం కాదు, పెట్రోలు పోసుకొని తగలబెట్టుకున్నా ప్రత్యేక హోదా రాదు…రాదు…రాదు’ అని కుండ బద్దలు కొట్టారు.కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వదనే సంగతి అందరికీ తెలుసన్నారు.
అంటే జగన్కూ ఈ విషయం తెలుసుని, అయినా రాజకీయం కోసం నిరాహార దీక్ష చేయబోతున్నారని అర్థం.ప్రత్యేక హోదా రాదని జేసీ అంత గట్టిగా చెప్పడంలో ఉన్న అర్థమేమిటంటే…చంద్రబాబు వల్ల కూడా కాదని, ఆయన ప్రజలను మభ్య పెడుతున్నారని ఇన్డెరెక్టుగా చెప్పడమన్నమాట.
ఓ పక్క ప్రత్యేక హోదా రాదని చెబుతూనే ‘కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా చంద్రబాబు ఆర్థిక వనరుల కోసం ఇతరత్రా ప్రయత్నాలు చేస్తుతన్నారు.చాలా కష్టపడుతున్నారు’ అని చెప్పారు.
ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా కేంద్రం నుంచి ఇతర ఆర్థిక ప్రయోజనాలు సాధిస్తారని అన్నారు.జేసీ దివాకర్ రెడ్డి మొన్నీమధ్య అసెంబ్లీ మీడియా పాయింటులో మాట్లాడుతూ జగన్ ప్రత్యేక హోదా తెస్తే తాను తక్షణం రాజీనామా చేయాలని ఎదురుచూస్తున్నానని అన్నారు.
వాస్తవానికి జేసీ దివాకర్ రెడ్డి ప్రజలకు నిజం చెప్పి మంచి పని చేశారు.ప్రత్యేక హోదాపై ప్రజలను మభ్య పెడితే ఎన్నికలప్పుడు ఓట్లు అడగడానికి ఇబ్బందిగా ఉంటుంది.
కాబట్టి ఆయన భారం దింపుకున్నారనే చెప్పుకోవాలి.