ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై పోరాటంలో దేశాలన్నీ పరస్పరం సహకరించుకుంటున్నాయి.సహజంగానే ప్రపంచ శాంతిని కోరుకునే భారతదేశం… కోవిడ్ 19 రోగులకు మెరుగ్గా పనిచేస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్ మందులను వివిధ దేశాలకు సరఫరా చేసి తన మానవత్వాన్ని చాటుకుంది.
ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం భారతదేశానికి అండగా నిలబడతామని హామీ ఇచ్చారు.ఇండియాలో కోవిడ్ 19 ఉద్ధృతి నేపథ్యంలో అమెరికా ప్రభుత్వానికి చెందిన యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (యూఎస్ఐఐడీ) ద్వారా భారత్కు 200 వెంటిలేటర్లు అందజేస్తామని తెలిపారు.
దీనిలో భాగంగా ట్రంప్ ప్రభుత్వం మొదటి విడతగా 100 వెంటలేటర్లను భారత్కు పంపించింది.మంగళవారం ఎయిరిండియా ప్రత్యేక విమానంలో ఈ వెంటిలేటర్లు మనదేశానికి చేరుకున్నాయి.వీటిని భారత్లోని రెడ్క్రాస్ సంస్థకు అందించినట్లు ఇండియాలోని అమెరికా దౌత్యవేత్త కెన్నత్ జస్టర్ వెల్లడించారు.ఈ వెంటిలేటర్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారయ్యాయని.
వైరస్ బారినపడిన రోగులకు చికిత్స చేయడంలో ఇవి భారత్కు ఉపయోగపడతాయని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది.
యూఎస్ఐఐడీ….భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీతో పాటు ఇరు దేశాల్లోని భాగస్వాములతో కలిసి భారతదేశంలో ఎంపిక చేసిన ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో పంపిణీ, రవాణా, ప్లేస్మెంట్లో సహాయం చేస్తోంది.వెంటిలేటర్లను భారత్కు విరాళంగా అందించే అంశానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మే 16న ట్వీట్టర్ ద్వారా తెలిపారు.
కాగా కొద్దిరోజుల క్రితం జరిగిన ఫోన్ సంభాషణలో జీ-7 కూటమి శిఖరాగ్ర సదస్సుకు హాజరుకావాలని ప్రధాని మోడీని ట్రంప్ ఆహ్వానించారు.మరోవైపు కోవిడ్ 19పై భారత్ చేస్తున్న పోరాటంలో అమెరికా స్పందన పట్ల మోడీ గతంలోనే కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ విజ్ఞప్తి మేరకు అమెరికాకు భారత్ హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలను సరఫరా చేసిన సంగతి తెలిసిందే.