తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి అమ్మ జయలలిత మృతి తర్వాత ఆమె మరణంపై లెక్కలేనన్ని సందేహాలు వస్తున్నాయి.ఈ క్రమంలోనే ఆమెను సింగపూర్లో ఉన్నత వైద్యం కోసం పంపాలని చేసిన ప్రయత్నాలను కొందరు కావాలనే అడ్డుకున్నారన్న మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
అన్నాడీఎంకే పార్టీ తిరుగుబాటు నాయకుడు పాండ్యన్ ఈ సంచలన విషయాన్ని బట్టబయలు చేశారు.జయ మరణం వెనక చాలా పెద్ద కుట్ర దాగి ఉందని…ఈ కుట్రను బయటపెట్టాలంటే ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ తక్షణమే జోక్యం చేసుకోవాలని పాండ్యన్ విజ్ఞప్తి చేశారు.
అపోలో ఆసుపత్రి ఇచ్చిన డిశ్చార్జ్ సమ్మరీలో జయ కిందపడి గాయపడడం వల్లే ఆసుపత్రిలో చేరారని ఉందని.అయితే ఆమె ఎవరైనా తోయడం వల్ల కిందపడిపోయారా ? లేదా ? ప్రమాదవశాత్తు గాయపడ్డారా ? అన్నది కూడా సందేహంగానే ఉందన్నారు.పాండ్యన్ చేసిన ఆరోపణల్లో కొన్నింటికి ఆన్సర్లే లేకపోవడం కూడా పలు సందేహాలకు తావిస్తోంది.
జయ పోయెస్ గార్డెన్స్లో అనారోగ్యానికి గురైనప్పుడు ఓ డీఎస్పీ అంబులెన్స్ రప్పించి ఆమెను అపోలోకు తీసుకెళ్లారని శశికళ వర్గం చెపుతోంది.
మరి ఆ టైంలో పోయెస్ గార్డెన్ చుట్టూ ఉన్న 27 సీసీ కెమేరాలను ఎందుకు తొలగించారన్న ప్రశ్నకు సరైన ఆన్సర్ లేదు.జయకు చికిత్స చేసిన ఎయిమ్స్ వైద్యులు ఎందుకు నోరు మెదపడం లేదని, దీనికి కేంద్రప్రభుత్వమే సమాధానం చెప్పాలని పాండ్యన డిమాండ్ చేశారు.
జయ సాయంత్రానికే మృతిచెందినా అర్ధరాత్రి వరకు ఎందుకు డ్రామాలాడారో అన్న ప్రశ్నను కూడా పాండ్యన్ శశికళ వర్గానికి సంధించారు.ఇక జయకు కంటిన్యూగా వైద్యం చేసే శాంతారం అన్న డాక్టర్ను పోయెస్ గార్డెన్ నుంచి బలవంతంగా వెళ్లగొట్టారన్న విషయాన్ని సైతం పాండ్యన్ బయటపెట్టారు.
ఏదేమైనా పాండ్యన్ ఆరోపణల తర్వాత జయ మృతిపై మరెన్నో సరికొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి.మరి ఈ విషయంలో కేంద్ర ఏమైనా స్పందిస్తుందా ? లేదా ? అన్నది చూడాలి.