అనుకున్నదే చేసింది తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ).నోటుకు ఓటు కేసులో నిందితుడైన టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దు మొర్రో అని హైకోర్టులో మొత్తుకున్నా ఏసీబీ అభ్యంతరాలు తోసిపుచ్చి న్యాయమూర్తి బెయిల్ ఇచ్చారు.
జైల్లో ఉండాల్సిన రేవంత్ బెయిల్పై బయటకు రావడమేమిటి? అని కేసీఆర్ ప్రభుత్వానికి ఒళ్లు మండింది.అందులోనూ రేవంత్ రెడ్డి జైలు నుంచి బయటకు రాగానే ‘కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయాల నుంచి తరిమికొడతా’ అంటూ భీషణ ప్రతిజ్ఙ చేశారు.
దీంతో రేవంత్కు శాస్తి చేయాల్సిందేనని నిర్ణయించుకున్న సర్కారు ‘ప్రొసీడ్’ అంటూ ఏసీబీ భుజం తట్టగానే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ గురువారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.బెయిల్ సమర్థనీయం కాదని పేర్కొంది.
రాష్ర్ట ఫోరెన్సిక్ లాబొరేటరీ నుంచి ఆడియో, వీడియో సంభాషణలకు సంబంధించిన తుది నివేదిక రావల్సి ఉందని, ప్రాథమిక నివేదికను డీకోడ్ చేయాలని తెలియచేసింది.ఇందుకు రెండు లేదా మూడు రోజుల సమయం పడుతుందని వివరించింది.
దీనిపై సుప్రీం కోర్టు ఏమంటుందో…! ఇక టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను కూడా వచ్చే రెండు రోజుల్లో ప్రశ్నించవచ్చని తెలుస్తోంది.