ఏపీలో అధికార టీడీపీ అధికారంలోకి వచ్చిందో లేదో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఆ పార్టీ డప్పేయడంలో విశ్వరూపం చూపించేస్తున్నారన్న చర్చలు చాలా ఓపెన్గానే జరుగుతున్నాయి.అధికార టీడీపీ మీద రాధాకృష్ణ ఈగ వాలనీయడం లేదని ఆయన మీడియాలో వస్తోన్న వార్తలే చెపుతున్నాయి.
గత ఎన్నికలకు ముందు ఏపీ, తెలంగాణలో కేవలం 5 లక్షల సర్యులేషన్ ఉన్న ఆంధ్రజ్యోతి తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే అదనపు హంగులు ఎన్నో సంతరించుకుంది.
ఈ పత్రిక సర్యులేషన్ ఇప్పుడు ఏకంగా 8.50 లక్షలు దాటేసి 9 లక్షలను క్రాస్ చేసేదిశగా దూసుకెళుతోంది.ఏపీలో చాలా చోట్ల నిన్నటి వరకు జ్యోతికి సొంత కార్యాలయాలు లేవు.
ఇప్పుడు చాలా జిల్లాల్లో కొత కార్యాలయాల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.వీటన్నింటి వెనక టీడీపీ అండదండలు, చంద్రబాబు సహాయ సహకారాలు ఉన్నాయన్నది వాస్తవమే అని ఓ టాక్.
ఇక రాధాకృష్ణ తనకు చేస్తోన్న మేళ్లకు ఇవన్నీ సరిపోవన్నట్టు ఇప్పుడు ఆయన్ను ఏకంగా రాజ్యసభకు పంపేందుకు చంద్రబాబు రంగం సిద్ధం చేసినట్టు వార్తలు వస్తున్నాయి.రాధాకృష్ణ రాజ్యసభ సభ్యత్వం కోసం చాలా రోజులుగా విశ్వప్రయత్నాలు చేస్తున్నారట.
అయితే ఇప్పుడు ఎట్టకేలకు రాధాకృష్ణకు చంద్రబాబుతో పాటు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కరుణ లభించినట్టు తెలుస్తోంది.
రాధాకృష్ణ రాజ్యసభకు వెళతారన్నది గ్యారెంటీ అని వార్తలు వస్తున్నా అది టీడీపీ తరపున వెళతారా లేదా మీడియా అధినేత కోటాలో రాష్ట్రపతి ద్వారా ఎంపిక చేయబడతారా ? అన్నది మాత్రం క్లారిటీ లేదు.రాష్ట్రపతి కోటాలో వెళ్లాలంటే మోడీ సిఫార్సు ఉండాలి.అయితే రాధాకృష్ణకు మోడీ సిఫార్సు కష్టమే కాబట్టి…ఆయన టీడీపీ నుంచే రాజ్యసభకు వెళ్లవచ్చన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.