మాజీ రాష్ర్టపతి అబ్దుల్ కలాం కన్నుమూసిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యా సంస్థలకు సెలవు దినంగా ప్రకటించగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పని చేయలేదు.తాను మరణిస్తే సెలవు ఇవ్వకూడదనేది కలాం అభిప్రాయమని, అందుకే సెలవు దినంగా ప్రకటించలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.‘నేను మరణిస్తే సెలవు ప్రకటించకండి.ఆ రోజు మరింత ఎక్కువ పనిచేయండి’ అని కలాం అన్నారని బాబు అన్నారు.
సచివాలయంలో కలాం నివాళి అర్పిస్తూనే చంద్రబాబు ఈ మాట చెప్పారు.కలాం, సింగపూర్ మాజీ ప్రధానమంత్రి లీ కున్ యే ఇద్దరూ గొప్ప వ్యక్తులని, వారు తమ మరణాలకు సెలవు ఇవ్వకూడదని చెప్పారని బాబు అన్నారు.
యువతకు స్ఫూర్తిదాయకుడు అబ్దుల్ కలామేనని తాను అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి చెప్పానని అన్నారు.రెండువేల మూడో సంవత్సరంలో తిరుపతిలోని అలిపిరి వద్ద తనపై మావోయిస్టులు దాడి చేసినప్పుడు కలాం ప్రొటోకాల్ను పక్కకు పెట్టి తనను పరామర్శించారని బాబు గుర్తు చేసుకున్నారు.
తాను మరణిస్తే సెలవు ఇవ్వొద్దని కలాం చెప్పివుండొచ్చు.ఇలాంటి వారి భావాలు, ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి.
మొత్తం మీద బాబు ఆయన చెప్పినట్లే చేశారన్నమాట.ప్రముఖులు చనిపోగానే సెలవు వస్తుందని, కాబట్టి బాగా ఎంజాయ్ చేయొచ్చని విద్యార్థులు, ఉద్యోగులు భావించడం మనకు తెలుసు.
కాని ఆంధ్ర ప్రదేశ్లోని వారికి కలాం చనిపోయినా సెలవు ఇవ్వకపోవడం కొత్తగా ఉండొచ్చు.జపాన్లోనూ ఇలాగే చేస్తారని అంటారు.
బాబుకు జపాన్, సింగపూర్ నీళ్లు బాగా పడినట్లున్నాయి.