దివంగత మాజీ సీఎం వైఎస్.రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఓ సంస్కృతి ప్రవేశపెట్టారు.
స్థానిక సంస్థలకు సంబంధించి తమ పార్టీ నాయకులు ఓకే కుర్చీ కోసం ఒకరికి మించి పోటీపడితే రాజశేఖర్రెడ్డి ఇద్దరిని సంతృప్తి పరిచేందుకు ఆ పదవీ కాలాన్ని చెరి సగ కాలం పంచేవారు.రాజకీయాల్లో వైఎస్ కొత్తగా ప్రవేశపెట్టిన ఈ సంస్కృతి తర్వాత అన్ని పార్టీలకు పెద్ద తలనొప్పిగా మారింది.
ఏపీలో పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నాయకులు అధికారంలోకి రాగానే పదవుల కోసం వంతులేసుకుని మరీ పోటీపడుతున్నారు.ఈ క్రమంలోనే స్థానిక నాయకులకు సర్ది చెప్పేందుకు ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జ్లకు తల ప్రాణం తోకమీదకు వస్తోంది.
ఈ క్రమంలోనే నాడు వైఎస్ తెరమీదకు తెచ్చిన ఈ 50-50 పదవుల పందేరం విషయం ఇప్పుడు టీడీపీలో గ్రూపులకు, గొడవలకు ఆజ్యం పోస్తోంది.సగం పదవీ కాలం పూర్తయిన వెంటనే పదవిని వదులుకోవాల్సిన వర్గం వారు అందుకు నో చెప్పడంతో రెండో వర్గం నేతలకు, ముందు పదవి చేపట్టిన వర్గం నేతల మధ్య టీడీపీలో అదిరిపోయే రేంజ్లో ఫైటింగ్ జరుగుతోంది.
నవ్యాంధ్ర రాజధాని విస్తరించి ఉన్న గుంటూరు జిల్లా టీడీపీలో ఈ టైప్ విబేధాలు పార్టీ పరువును బజారు కీడుస్తున్నాయి.కొద్ది రోజుల క్రితం గుంటూరు జిల్లా మాచర్ల మునిసిపల్ చైర్ పర్సన్గా కొనసాగిన శ్రీదేవి పదవి నుంచి తప్పుకునేందుకు ఆమె ససేమీరా అన్నారు.
ఆమెను బలవంతంగా టీడీపీలోని మరోవర్గం పదవి నుంచి తప్పించింది.ఆ తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకున్నారు.
ఇక ఇప్పుడు బాపట్ల ఎంపీపీ వంతు వచ్చింది.ఇక్కడ రాజీ ఫార్ములాలో భాగంగా మానం విజేత… తొలి రెండున్నరేళ్ల పాటు ఎంపీపీగా ఎంపికయ్యారు.
ఆ రెండున్నరేళ్ల పదవీ కాలం ముగిసింది.అయితే ఇప్పుడు విజేత తనకు రెండన్నరేళ్లు మాత్రమే పదవి ఇస్తానని ఎవ్వరూ చెప్పలేదని.
తాను తన పదవికి రాజీనామా చేయనని చెపుతున్నారు.మరో వర్గం మాత్రం విజేత తన పదవికి రాజీనామా చేయాల్సిందేనని గొడవకు దిగారు.
దీంతో ఆమెకు గుండెపోటు వచ్చింది.జిల్లాలో ప్రత్తిపాడు నియోజకవర్గంలో కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంది.
గుంటూరు జిల్లాలో 50 – 50 రాజకీయాలు టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారాయి.