వైకాపా అధినేత వైఎస్.జగన్కు 2019 ఎన్నికలు చావో రేవో లాంటివి.ఈ ఎన్నికల్లో విజయం సాధించకపోతే ఏపీలో ప్రాంతీయ పార్టీగా ఉన్న వైకాపా పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండడం కష్టమే.2019లో కూడా జగన్ సీఎం పీఠం అధిష్టించకపోతే 2024 నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో అంచనా వేయడం కష్టం.ఈ క్రమంలోనే జగన్ 2019 ఎన్నికల్లో గెలుపు కోసం తన గేమ్ ప్లాన్ అప్పుడే స్టార్ట్ చేసేశాడు.
గడపగడపకు వైకాపా పేరిట జగన్ ప్రజల్లోకి చొచ్చుకుపోతోన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న సీనియర్లను సైతం తన వైపునకు తిప్పుకుంటున్నాడు.ఏపీలో కాంగ్రెస్లో ఉండి ఫ్యూచర్ కోసం వెయిట్ చేస్తోన్న సీనియర్లతో పాటు బీజేపీలో బిక్కు బిక్కుమంటోన్న వారికి సైతం జగన్ ఆకర్షణీయమైన ఆఫర్లు ఇస్తున్నాడన్న చర్చలు వైకాపాలో జరుగుతున్నాయి.
వీటితో పాటు జగన్ జిల్లాల్లో సైతం పర్యటనలు చేస్తున్నాడు.తాజాగా జగన్ 2019 ఎన్నికల దృష్ట్యా తన ఫస్ట్ హామీ ఇచ్చేశారు.
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు నెలల్లోనే కాంట్రాక్టు లెక్చరర్ల ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తామని జగన్ హామీ ఇచ్చారు.ఈ విషయంలో తాను కోర్టుకు వెళ్లి అయినా కాంట్రక్టు లెక్చరర్లకు న్యాయం చేస్తానని మరీ జగన్ నొక్కి వక్కాణించారు.
జగన్ రెండు రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో రాజమండ్రి సమీపంలోని బూరుగుపూడి గ్రామం వద్ద జగన్ను కలిసిన కాంట్రాక్టు ఉద్యోగులు తమ సమస్యను జగన్కు చెప్పడంతో జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ సమస్యను పరిష్కరిస్తామని.అవసరమైతే ఈ విషయంలో కోర్టుకు వెళ్లి మరీ వారికి న్యాయం చేస్తానని చెప్పడం విశేషం.
2019 ఎన్నికల దృష్ట్యా జగన్ ఇచ్చిన తొలి హామీగా ఇది రికార్డులకు ఎక్కనుంది.ఇప్పటి వరకు హామీలు లేకుండా కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్న జగన్ ఇప్పుడు ఈ హామీతో 2019కు తన హామీల పరంపరను స్టార్ట్ చేసినట్లయ్యింది.ఇక చంద్రబాబు ప్రభుత్వంపై ఇప్పుడిప్పుడే వ్యతిరేకత స్టార్ట్ అవుతోంది.
ఈ క్రమంలో బాబు ఆ వ్యతిరేకత పెరగకుండా 2003 తరహాలోనే ముందస్తు ఎన్నికలకు వెళతారన్న చర్చలు కూడా స్టార్ట్ అయ్యాయి.ఈ క్రమంలోనే జగన్ తన హామీల చిట్టాను విప్పడం స్టార్ట్ చేసినట్టు స్పష్టమవుతోంది.